మ‌న‌సుని క‌దిలించే మ‌ల్లేశం ట్రైల‌ర్‌

-

నిజ జీవితాల‌ను అంతే స‌హ‌జంగా ఆడియెన్స్ ని ఆక‌ట్టుకునే విధంగా తెర‌కెక్కిస్తే వాటికి ఎప్పుడూ ఆద‌ర‌ణ ఉంటుంది. స్ఫూర్తివంత‌మైన‌, భావోద్వేగ‌భ‌రిత‌మైన జీవితాలు తెర‌పై చూసేందుకు ఆడియెన్స్ ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తిని క‌న‌బరుస్తారు. ఓ మామూలు వ్య‌క్తి అసామాన్యుడిగా ఎదిగే క్ర‌మంలో ప‌డే సంఘ‌ర్ష‌ణ‌, ఇబ్బందులు, అవ‌మానాలు రంజింప చేస్తాయి, భావోద్వేగానికి గురి చేస్తాయి. భావోద్వేగాలు, వినోదం సినిమాకు కావాల్సిన ప్ర‌ధానాంశాలు. తెలుగు ఆడియెన్స్ ప్ర‌ధానంగా ఎమోష‌న్స్ కి బాగా క‌నెక్ట్ అవుతాయి. అలాంటి ఎన్నో భావోద్వేగాలు, వినోదం, అనేక మ‌జిలిలు, అవ‌మానాలు పుష్క‌లంగా ఉన్నచిత్రం మ‌ల్లేశం. తెలంగాణలోని యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని శారాజీపేటకి చెందిన చేనేత కార్మికుడు చింత‌కింది మ‌ల్లేశం జీవితం ఆధారంగా మ‌ల్లేశం పేరుతో ఓ స్ఫూర్తివంత‌మైన బ‌యోపిక్ రూపొందుతుంది.

ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్‌ యాన్‌ ఆర్డినరీ మ్యాన్ అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక. మ‌ల్లేశం పాత్ర‌లో హాస్య‌న‌టుడు ప్రియ‌ద‌ర్శి న‌టిస్తున్నారు. రాజ్‌ ఆర్‌ దర్శకత్వంలో శ్రీ అధికారి, రాజ్‌ ఆర్‌ నిర్మిస్తున్నారు. అనన్య, ఝాన్సీకీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్ బుధ‌వారం విడుద‌లైంది. ఇది ఆద్యంతం ఎష‌న‌ల్‌గా సాగుతుంది. ఒక చీరకు ఆసు పోయాలంటే దారాన్నిదాదాపు 9వేల సార్లు తిప్పాలి. రోజుకు రెండు చీరెలు నేస్తే వాకిరి గిట్టుబాటు అవుతుంది. దారాన్ని కండెల చుట్టూ తిప్పడానికి మల్లేశం తల్లి లక్ష్మి చాలా కష్టపడేవారు. ఏళ్ల తరబడి ఆసుపని చేసి, చివరకు తన చేతులు ప‌నిచేయ‌లేని స్థితికి చేరుతుంది. దీంతో పెద్దగా చదువులేని, అల్లరిచిల్లరిగా తిరిగే మల్లేశం ఎలాగైనా చేనేత ప‌ని ఈజీ చేయాల‌ని ఆసు యంత్రం తయారు చేయాలనుకుంటాడు. ఆలోచించి ఆలోచించి ఆసు యంత్రాన్ని తయారు చేశారు. దానికి లక్ష్మీ ఆసుయంత్రం అని పేరు పెట్టారు.

దీనికి 2011లో పేటెంట్ హక్కు కూడా లభించింది. ఈ యంత్రాన్ని కనిపెట్టినందుకుగాను తెలంగాణ రాష్ట్ర సిఫారుసు మేరకు 2017లో మల్లేశంకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసింది. అయితే ఈ ఆసుయత్రం త‌యారు చేసే క్రమంలో తను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, ఒడిడుకులను, తాను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చీర‌ల‌ను నేచి ప్రపంచాన్ని ఎలా అబ్బుర పరిచారు? అనే అంశాలతో పాటు చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఆయన చేసిన కృషి ఏమిటనే అంశాల స‌మాహారంగా ఈ చిత్రం తెర‌కెక్కింద‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌ల్లేశం పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి ఒదిగిపోయి త‌న న‌ట విశ్వ‌రూపం చూపించారు. ఈ సినిమా జూన్ 21న విడుద‌ల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news