టాలీవుడ్ మంచు ఫ్యామిలీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గత కొంతకాలంగా సద్దుమణిగిన వివాదం మళ్లీ మొదలైంది. నటుడు మంచు మోహన్బాబు కుమారుడు మంచు మనోజ్.. తన కారు చోరీ అయ్యిందంటూ నార్సింగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి తాను రాజస్థాన్ కు వెళ్లానని.. తాను ఇంట్లో లేని సమయంలో తన సోదరుడు మంచు విష్ణు కొంతమందితో కలిసి చొరబడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కారు దొంగతనం చేసి.. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ ఇవాళ మోహన్ బాబు ఇంటి వద్ద నిరసనకు దిగారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంచు మనోజ్ ఆందోళన చేపట్టారు. తన కూతురు బర్త్ డే వేడుకలకు రాజస్థాన్కు వెళ్లగా.. తన ఇంట్లోని కారు, వస్తువులను అపహరించారని మనోజ్ ఆరోపించారు. మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదని చెప్పారు. దీంతో జల్పల్లి ఇంటి గేటు వద్ద మనోజ్ బైఠాయించారు.