దేవాలయాల్లో ‘బలిపీఠం’ ఎందుకుంటుంది? దాని విశిష్ట‌త ఏంటి?

-

ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు. తిరుమల ఆలయం చుట్టూ వీటిని మనం చూడవచ్చు.

దేవాలయానికి ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు తప్పక వెళ్లే ఉంటారు. అక్కడ ఉన్న కొన్ని నిర్మాణాల విశిష్టత చాలామందికి తెలియదు. ధ్వజస్థంభం, విమాన గోపురం, బలిపీఠం, ప్రాకారాలు, ఆయా దేవుళ్లకు సంబంధించిన వాహనాలు ఇలా రకరకాల నిర్మాణాలు ఉంటాయి. ముఖ్యంగా బలిపీఠం గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం…

బలిపీఠం: దేవాలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తయిన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగుడి, విమానం, విగ్రహం (మూలమూర్తి), బలిపీఠం ఇవి నాలుగూ ఉంటేనే దాన్ని దేవాలయం అంటారు. కనుక ఆలయంలో బలిపీఠం ప్రముఖమైనది. ఆలయంలోని మూలమూర్తికి, ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు. గర్భగుడిలో ఆంతరంగికంగా శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం. ఆరుబయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి. బలిప్రదానం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది. బలి బుక్కుల వల్ల కంటికి కనిపించే భైరవ (కుక్క), కాకి, పక్షులు, చీమలు, పురుగులు, కనిపించని సూక్ష్మజీవులు ఎన్నో తృప్తి చెందుతాయి. తప్పనిసరిగా బలిబుక్కులు ఇవ్వాలనేది శాస్త్ర నియమం.

బలిపీఠాల గురించి శాస్త్రంలో

విష్ణుతిలక సంహిత బలిపీఠాలను శిల్పరత్నం మట్టితో, కొయ్యతో కూడా నిర్మించవచ్చని చెప్పింది. మానసార శిల్పశాస్త్రం గ్రంథాలు గోపురం బయట, లేక మొదటి ప్రాకారానికి బయట బలిపీఠాన్ని నిర్మించాలని చెప్పాయి. తిరుమల వంటి ఆలయాలలో బలిపీఠం ప్రాకారానికి బయటే ఉంటుంది. గర్భగుడిపై ఉన్న విమానం, గుడికి ముందు ఉన్న బలిపీఠం రెండూ ఒకటే అని నారాయణ సంహిత చెప్పింది. విమానం ముకుళితపద్మం (ముడుచుకుని ఉన్న తామర) వలె ఉంటే బలిపీఠం వికసితపద్మం (విరిసిన కమలం) వలె ఉంటుంది. దేవాలయంలో కేంద్రీకృతమైన శక్తి చైతన్యం విమానం ద్వారా పైకి ప్రవహిస్తే, బలిపీఠం ద్వారా అడ్డంగా ప్రవహిస్తుంది. ఆలయపురుషుని నాభి ప్రదేశంలో బలిపీఠం ఉంటుంది. కనుక ఆలయానికి ఇది కేంద్రస్థానం అని భావించాలి.

ప్రధాన బలిపీఠం

ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు. తిరుమల ఆలయం చుట్టూ వీటిని మనం చూడవచ్చు. శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగంగా పిలుస్తారు. ఇందులో శివుడు సదా ఉంటాడని, బలిపీఠాన్ని దర్శించినా శివదర్శనం అయినట్లే అని శైవాగమాలు చెబుతున్నాయి. ముఖమండపం చేరే ముందు భక్తులు బలిపీఠానికి ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసి తనలోని అహంకారాన్ని బలిగా అక్కడ విడిచి బలిపీఠం నుండి వచ్చే దైవీకశక్తిని తనలో నింపుకుని దైవదర్శనానికి వెళ్లాలి.

బలిపీఠానికి ప్రదక్షిణ చేసే వీలు లేకపోయినా తాకి నమస్కరించవచ్చు. బలి వేసిన అన్నం ఆయా దేవతలకు మాత్రమే. మానవులు దాన్ని భుజించకూడదు. బలిపీఠ దర్శనంతో భక్తులకు సమస్త దోషాలు పోతాయని శాస్త్ర వచనం, అంతేకాదు ఆయా దిక్కుల్లో ఉన్న బలిపీఠాలను ప్రదక్షిణ సమయంలో నమస్కరించుకుంటూ పోవాలి. దానివల్ల ఆయా దిక్కుల ఆధిదేవతలు, దేవతలు సంతోషించి మేలు చేస్తారని పండితులు పేర్కొంటున్నారు. ఇక తెలిసింది కదా ఈ సారి దేవాలయానికి వెళ్లినప్పుడు బలిపీఠానికి శ్రద్ధతో నమస్కరించి ప్రదక్షిణలు చేయండి. సత్ఫలితాలను పొందండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news