వారంలో ఏ రోజు ఏ దేవుడికి ఏ పూజ చేస్తే ఎటువంటి ఫ‌లితం ఉంటుందో తెలుసా?

-

ఏ రోజు ఏ పూజ చేయాలి? ఏ పూజ చేస్తే పుణ్యఫలితం వస్తుంది. ఏ దేవునికి ఏ వారం ప్రీతికరం ఈ విషయాలల్లో పలువురికి రకరకాల ఆనుమానాలు, తికమక ఉంటుంది. అయితే శాస్త్రంలో ఏ రోజు ఏ దేవునికి పూజిస్తే మంచిదో పలు సందర్భాల్లో వివరించింది. శివపురాణంలో 14వ అధ్యాయంలో దేవతల ప్రీతికోసం ఐదురకాలైన పూజల గురించి పేర్కొంది. లతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవి ఐదు విధాలు. ఏ వారం ఏ దేవున్ని పూజించాలో తెలుసుకుందాం…

ఆదివారం: ఆదిత్యుని, ఇతర దేవతలను పూజించి పండితులను సత్కరించడం లేదా వారికి భోజనపదార్థాలను దానం చేయడం చేయాలి. దీనివల్ల కంటిరోగాలు, తలకు సంబంధించిన సమస్యలు, కుష్టువ్యాధి, దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయి లేదా ఉపశమనం కల్గిస్తాయి. ఆదివారం సూర్యారాధన వల్ల ఆరోగ్యంతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

సోమవారం: సోమవారం అంటే చంద్ర సంబంధ వారం. దీనికి సోముడు అంటే శివునికి సంబంధించిన లేదా ప్రీతికరమైన రోజు. అదేవిధంగా లక్ష్మీ దేవికి ప్రీతికరం. ఈ రోజు సంపద కోసం అయితే శివ/లక్ష్మీ ఆరాధన చేయాలి. అభిషేకం, కుంకుమార్చన చేస్తే మంచిది. అదేవిధంగా విష్ణు/వైష్ణవ సంప్రదాయం వారు అయితే వేంకటేశ్వరుడికి అభిషేకం/పుష్పార్చన చేస్తే విశేష ఫలితం వస్తుంది.ఈ రోజు పండితులకు /బ్రాహ్మణులకు లేదా ఎవ్వరికైన నెయ్యితో భోజనం/పదార్థాలను ఇస్తే మంచి జరుగుతుంది.

మంగళవారం: ఆంజనేయస్వామికి, గణపతికి ప్రత్యేక సందర్భాలలో, దుర్గాదేవికి ప్రీతికరమైన రోజు. ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం కాళీ దేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి. ఆంజనేయస్వామికి వడమాల, తమలపాకులతో అర్చన చేస్తే భయాలు, రోగాలు పోతాయని శాస్త్ర వచనం.

 

బుధవారం: బుధవారం గణపతికి, అయ్యప్పస్వామికి ప్రీతికరమైన రోజు అదేవిధంగా విష్ణుమూర్తికి ఆరాధనీయమైన రోజు. బుధవారం రోజు పెరుగు అన్నాన్ని విష్ణు దేవునికి నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

 

 

గురువారం: ఈ రోజు వేంకటేశ్వరస్వామి, దత్తాత్రేయుడు, సాయిబాబా పూజ చేయడం శ్రేయస్కరం. ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవానికి గురువారం రోజున పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్ర్తాలను కూడా నివేదించి అర్చన చేయడం కూడా శుభకరం.

 

శుక్రవారం: లక్ష్మీదేవికి, అమ్మవార్లు అంటే దుర్గా, కాళీ, లలితా, కామాక్షీ, మీనాక్షీ వంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే మంచిది. అదేవిధంగా తులసీపూజ, గోపూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. ఈ రోజు పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్ర్తాలను బహూకరించడం మంచిది.

 

శనివారం: శనివారం అంటేనే కలియుగ దైవం వేంకటేశ్వరుడికి ప్రీతికరం. అదేవిధంగా ఆంజనేయస్వామి, శనిదేవతల ఆరాధన ఉత్తమం. తప్పక హనుమాన్ లేదా రుద్ర సంబంధ అంటే శివాలయాలు, వేంకటేశ్వర ఆలయా సందర్శన, ప్రదక్షణలు సకల దోషాలను పోగొడుతాయి. శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శని దోష పూజాది కార్యక్రమాలు కూడా చేయవచ్చు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news