” వరలక్ష్మీ వ్రతం ” కథ.. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా.. చూసినా సకల సౌభాగ్యాలు

-

శౌనకాది మహర్పులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా ! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. ” వరలక్ష్మీ వ్రతం ” కథ శ్రద్ధగా వినండి.

parvathi parameshwara
parvathi parameshwara

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి. ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా ! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్దిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.అప్పుడు పార్వతీదేవి దేవా ! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు ? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది కాత్యాయనీ.

పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం: వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.

శ్రావ‌ణ మాసం వరలక్ష్మీ వ్రతం
శ్రావ‌ణ మాసం వరలక్ష్మీ వ్రతం

శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ‘సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.

అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచితకంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకువరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

varalakshmi vartham
varalakshmi vartham

వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా& శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్న సవివ‌రంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని శౌనకాది మహర్పులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి.

వరలక్ష్మీ వ్రతం చేస్తే ఏం లభిస్తాయి?

భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు పైన చెప్పిన శాస్త్ర విధానంతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి అమ్మ అనుగ్రహాన్ని పొందండి.

వరలక్ష్మీ వ్రతం PDF

చాలామందికి వ్రతవిధానం తెలియక వ్రతం చేసేవారు లేక , తమకు తోచిన విధంగా మమా అనిపిస్తారు. అటువంటి వారందరు శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి మన లోకం సవివరమైన వరలక్ష్మి వ్రత కల్పం PDF పిడిఎఫ్ (https://bit.ly/2BmG86S)‌ రూపంలో మీకు అందిస్తుంది.  ఈ పుస్తకంలో వరించిన విధానంలో లో వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్ధన.

సర్వేజనాసుఖినోభవతు!

ఇట్లు
మన లోకం

Read more RELATED
Recommended to you

Latest news