లాక్‌డౌన్‌ భయం…. ఖాళీ అవుతున్న నగరాలు

-

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత మూడు నాలుగు రోజులుగా లక్షకు పైగా కోవిడ్ కేసులు నమోదవడం అందరినీ కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,26,789 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. ప్రస్తుతం 9,10,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ విధిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌ లాంటి రాష్ట్రాలు ఇప్పటికి ఈ బాటలో నడుస్తున్నాయి.

అయితే కరోనా తీవ్రత పెరుగుతుండంతో ఢిల్లీ, ముంబై, సూరత్‌, అహ్మదాబాద్‌ సహా మిగిలిన రాష్ట్రాల్లోని పలు నగరాలు ఖాళీ అవుతున్నాయి. చాలా మంది వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు పయనమవుతున్నారు. అయితే గతేడాది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెల్సిందే. ఈ నిర్ణయం చాలా మంది వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపింది. లక్షల మంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపాధి లేక, తినడానికి తిండి లేక, సొంతూళ్ళకు వెళ్ళడానికి రవాణా సౌకర్యం లేక అనేక కష్టాలు పడ్డారు. కాలినడకన సొంతూళ్లకు చేరుకున్నారు. కొంత మంది మార్గమధ్యలో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కూడా కోల్పోయారు.

అయితే గత రెండు మూడు నెలలుగా కరోనా తగ్గు ముఖం పట్టడంతో వారంతా నగరాల బాట పట్టారు. అయితే మళ్ళీ కరోనా విజృంభణ ప్రారంభం కావడంతో వలస కార్మికుల్లో భయం నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో మళ్ళీ లాక్‌డౌన్‌ విధిస్తారనే భయంతో చాలా మంది వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు బయలుదేరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news