బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు వదిలేసి ఆటోల్లో తిరిగిన అమెరికా దౌత్యవేత్తలు..

-

సామాన్యులు ఆటోలో తిరిగితే..అది ఏం వింత కాదు..కానీ బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లల్లో తిరిగే వాళ్లు కార్లు దిగి ఆటోలో తిరిగితేనే అది పెద్ద వార్త..వైరల్‌ అవుతుంది. మొన్నటికిమొన్న ట్రాఫిక్‌ సమస్య భరించలేక.. ఓ ప్రముఖ కారు కంపెనీ కారు సీఈవో కారు దిగి నడుచుకుంటూ.. వెళ్లి ఆటో ఎక్కి వెళ్లాడు.. ఇలాంటి ఘటనలు ఎన్నో. ఇప్పుడు అమెరికా దౌత్యవేత్తలు అంటే దేశంలో ప్రభుత్వం వారికి పూర్తి భద్రత కల్పిస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా కేటాయిస్తుంది. వాళ్లు అత్యంత భద్రత మధ్య ఉంటారు. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో నలుగురు అమెరికా మహిళా దౌత్యవేత్తలు వీటన్నింటినీ వదిలేసి సామన్యుల్లా తిరిగారు.

తమ బుల్లెట్ ప్రూఫ్ కార్లు వదిలేసి, ఆటోరిక్షాల్లో తిరిగారు. ఏదో ఊరికే సిటీ అంతా తిరగడం కాకుండా, అధికారిక కార్యక్రమాలకు కూడా ఆటోలోనే హాజరయ్యారు. అంతేకాదు.. ఆటోను నడిపింది కూడా వాళ్లే అవడం విశేషం… ఈ విషయంపై దౌత్యవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన అన్ ఎల్ మేసన్, రూత్ హోంబర్గ్, షరీస్ జె కిట్టర్‌మ్యాన్, జెన్నిఫర్ బైవాటర్స్ అనే నలుగురు మహిళా దౌత్యవేత్తలు ఢిల్లీలో అధికారిక హోదాలో పని చేస్తున్నారు. వారికి ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా కేటాయించింది. అయితే, ఆ కార్లు వదిలేసి సాధారణ ఆటోల్లో సామాన్యుల్లా తిరిగారు.

ఢిల్లీ వీధుల్లో ప్రత్యేకంగా కనిపించే పింక్ కలర్ ఆటోతో పాటు, బ్లాక్ కలర్ ఆటోలో నలుగురూ ప్రయాణించారు. ఇవి సాధారణ పర్సనలైజ్డ్ ఆటోలు. వీటిలో బ్లూటూత్ డివైజ్ వంటి సాధారణ ఫీచర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఆటోల్లో వాళ్లు ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టారు. అధికారిక కార్యక్రమాలకు కూడా అలానే హాజరయ్యారు. ఇలా సాధారణ పౌరుల్లాగా ఆటోలో తిరిగే అవకాశం రావడంపై వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. దౌత్యవేత్తలు చేయాల్సింది స్థానిక ప్రజలతో సంబంధాలు పెంచుకుంటూ, ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవడమే అని, ఆటోలో తిరగడం ద్వారా తాము చేసింది అదేనని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news