హైదరాబాద్‌లో బస్సు.. నాందేడ్‌లో తుక్కు..!

-

ఇది నిజంగా వింత సంఘటన. సినీఫక్కీలో జరిగింది. మహేశ్‌బాబు ‘ఖలేజా’ చూసే ఉంటారు కదా. అచ్చం అలాగే బస్పును మాయం చేశారు. హైదరాబాద్‌లోని సీబీఎస్‌లో పార్క్ చేసిన బస్సు మాయమై నాందేడ్‌లో ప్రత్యక్షమైంది. అది కూడా అస్థిపంజరంలా దొరికింది. మంగళవారం రాత్రి బస్సును సీబీఎస్‌లో పార్క్ చేసి బస్సు డ్రైవర్, కండక్టర్ రెస్ట్ రూమ్‌కు వెళ్లిపోయారు. తెల్లారి 5 గంటలకు వచ్చి చూస్తే అక్కడ బస్సు లేదు. గాయబ్‌. దీంతో అక్కడా ఇక్కడా వెతికారు. ఎక్కడా బస్సు కనిపించలేదు. దీంతో వెంటనే అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన అఫ్జల్ గంజ్ పోలీసులు.. సీబీఎస్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి.. బస్సు దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. సిటీల్లోని ఇతర సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. బస్సు నాందేడ్ రూట్‌లో వెళ్లినట్లు తెలిసింది. నాందేడ్‌లోని షెడ్‌కు ఆ బస్సును తీసుకెళ్లిన దుండగులు.. దాన్ని పూర్తిగా ఎక్కడికక్కడికి విడదీసారు. వెంటాడుతూ, నాందేడ్ చేరుకున్న అఫ్జల్ గంజ్ పోలీసులకు గట్టి షాక్‌ తగిలింది. అక్కడ అసలు బస్సనేదే లేదు. సీట్లు, రాడ్లు, ఇనుకరేకులు, బస్సురూట్‌ ప్లేటు, ఆఖరికి బస్సు అడుగు ఫ్రేము తప్ప ఏమీ కనబడలేదు. అప్పటికి కూడా పాపం… పిల్లలు ఇంకా కష్టపడుతూనేఉన్నారు. నాందేడ్ పోలీసుల సాయంతో షెడ్‌లో బస్సును ధ్వంసం చేస్తున్న దుండగులను అదుపులోకి తీసుకున్నారు. అన్నట్లు, బస్సును ఈ షేపుకి తీసుకురావడానికి వాళ్లకి కేవలం ఆరు గంటలే పట్టిందట. మంచి పనిమంతులే కదా.!

Read more RELATED
Recommended to you

Exit mobile version