తెలంగాణలోని ఆ ప్రదేశం వద్ద వజ్రాలు లభ్యం అవుతాయట…పరిశోధనలో షాకింగ్ నిజాలు

-

బంగారు తెలంగాణ అని మనం రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో అలా అంటుంటాం..కానీ నిజానికి ఇప్పుడు ఆ మాట వాస్తవం అయ్యేలా ఉంది. తాజాగా చేపట్టిన పరిశోధనలో నల్గొండ జిల్లాలోని కృష్ణానదిలో మూసీ నది కలిసే సంగమ ప్రదేశంలో వజ్రాలు దొరికే అవకాశం ఉందని తేలిందట. ఓయూ యూనివర్సిటీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇతర సంస్థల పరిశోధకులు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లో అధ్యయనాలు జరిపాయి.

హైదరాబాద్ నగరం మధ్య నుంచి కృష్ణా నది ఉపనది అయిన మూసీ నది ప్రవహిస్తుంటుంది. హైదరాబాద్ వాసులకు మూసీ నది అంటే మురికినది అని..అక్కడకు వెళ్తే..కంపుతట్టుకోలేం అని భావనమాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడది వజ్రాల గని కాబోతోంది.
పరిశోధకుల అధ్యయనాల్లో నల్గొండలో వజ్రాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా మూసీ నది కృష్ణానదిలో కలిసే చోట వజ్రాల గని ఉంటుందని పరిశోధన అధ్యయనాల్లో విస్పష్టమయింది. అందుకే ప్రస్తుతం హైదరాబాద్‌లోని మూసీ దిగువన, కృష్ణాలో సంగమం జరిగే వాడపల్లి వరకు తాను దృష్టి సారించినట్లు ఓయూ ప్రొఫెసర్ రామదాస్ పేర్కొన్నారు.

కృష్ణమ్మ కలిసే చోట..కలిసిరానుందా..

అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో భీమా నది కృష్ణమ్మ ఒడిలో కలిసే ప్రదేశంలో.. గద్వాల్ జిల్లాలో తుంగభద్ర నది కృష్ణాలో కలిసే ప్రదేశంలో వజ్రాలు కలిగిన కింబర్‌లైట్‌లు, లాంప్రాయిట్‌లు కూడా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ప్రఖ్యాత కోహినూర్‌తో సహా ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన అత్యుత్తమ వజ్రాలలో కొన్ని కృష్ణా నది నుంచే లభించినవే అని మీకు తెలుసా. లాంప్రోయిట్ అనేది అల్ట్రాపోటాసిక్ మాంటిల్-ఉత్పన్నమైన ఒక అగ్నిపర్వత లేదా ఉప-అగ్నిపర్వత శిల. కింబర్‌లైట్‌ అనేది కూడా ఒక అగ్ని శిలే. ఈ రెండు ప్రత్యేకమైన రాళ్ల నుంచి వజ్రాలను వెలికితీయవచ్చు. ఇలాంటి రాళ్లు/శిలలు మన కృష్ణా నదిలో ఉపనదులు సంగమం అయ్యే ప్రదేశంలో ఉండటం చాలా గొప్ప విషయం.

గోల్కొండలో తవ్వినప్పటికీ..అబ్బే ఏం దొరకలా.

గోల్కొండలో వజ్రాలు తవ్వినప్పటికీ అక్కడ ఏం దొరకలేదు. కాకపోతే దక్షిణ భారత వజ్రాల ప్రావిన్స్ లో తవ్విన వజ్రాలను ‘గోల్కొండ వజ్రాలు’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడే ప్రసిద్ధ గనులు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మనిషి కంటికి చిక్కకుండా దాగున్న వజ్రాల సంపదను విజయవంతంగా బయటకు తీసినట్లైతే..‘గోల్కొండ వజ్రాలు’ అనే నామకరణం నిజమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లో అధ్యయనాలు చేపట్టగా రంగారెడ్డిలో వజ్రాలు లేవని నిర్ధారణ అయినట్లు ఓయూ జియోఫిజిక్స్ మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి. రామదాస్ తెలిపారు. అయితే వజ్రాలు నల్గొండ జిల్లా నుంచే వెలికి తీసే అవకాశం ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందట .

కృష్ణానదిలో తుంగభద్ర, భీమా, మూసీ నదుల సంగమ ప్రదేశాల్లో వజ్రాలతో కూడిన శిలలు ఉన్నాయని.. కాకపోతే అవి భూమిలో లోతుగా ఉన్నాయని రామదాస్ స్పష్టం చేశారు.

కల్వకుర్తి మండలంలో వజ్రాలు ఉన్నట్లు ఇటీవల రామదాస్ రీసెర్చ్ లో తేలింది. “ఈ ప్రాంతంలో డైమండ్‌ల ఉనికిని సూచించే డైక్‌లు, ఫాల్ట్ కాంటాక్ట్ పరిసరాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గతంలో, పరిశోధకులు కృష్ణా బేసిన్‌లోని మిర్యాలగూడలోని రామన్నపేట-ఉస్తాపల్లి లాంప్రోయిట్ బాడీ వద్ద వజ్రాలు లభ్యమయ్యే ప్రాంతాలు ఉన్నట్లు కనుగొన్నారు.

మొత్తానికి తెలంగాణలో కొన్ని ప్రదేశాల్లో వజ్రాలు ఉన్నట్లు తేలింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news