అక్రమంగా తరలిస్తున్న రూ. 30 కోట్ల విలువైన పాము విషాన్ని పట్టుకున్న పశ్చిమబెంగాళ్‌ పోలీసులు

-

పాములు ఎంత డేంజరో.. వాటి విషం కూడా అంతే డేంజర్‌. కానీ పాము విషానికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. వివిధ రకాల పాముల విషాన్ని అక్రమంగా తరలించే దందా కూడా గుట్టుగా సాగుతోంది. అయితే ఇలా ఫ్రాన్స్ నుంచి చైనాకు అక్రమంగా తరలిస్తున్న రెండున్నర కేజీల పాము విషాన్ని భారత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అధికారులు స్వాధీనం చేసుకున్న పాము విషం ఖరీదు.. మార్కెట్లో రూ. 30 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో.. ఫన్సిడేవా ప్రాంతంలోని ఘోష్పుకూర్ అటవీ ప్రాంతంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో శనివారం రాత్రి రెండున్నర కేజీల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర కేజీల విషం కోట్లలో ఉందంటే మామూలు విషయం కాదు.. ఓ క్రిస్టల్ జార్‌లో నింపి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి.. విచారించగా అసలు నిజం తెలిసింది.
పట్టుబడ్డ నిందితుడిని మహమ్మద్‌ సరాఫత్‌గా గుర్తించినట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి. ఉత్తర దినాజ్‌పుర్‌ జిల్లాలోని ఖురాయి ప్రాంతానికి చెందినవాడని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పాము విషానికి విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈ పాము విషం ఫ్రాన్స్‌ నుంచి బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌లోకి వచ్చిందని నిందితుడు తెలిపాడు. ఈ విషాన్ని భారత్ నుంచి నేపాల్‌కు తీసుకెళ్ళి… అక్కడ నుంచి చైనాకు తీసుకెళ్లాలన్నది నిందితుల వ్యూహమని వివరించారు.
పశ్చిమ బెంగాల్‌లో పాము విషాన్ని స్వాధీనం చేసుకోవడం నెల రోజుల్లో ఇది రెండోసారి. జల్పాయ్‌గురి జిల్లాలో సెప్టెంబర్ 10న రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాము విషాన్ని సేకరించేది పేదవాళ్లు.. వారు ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి పాము విషాన్ని సేకరిస్తారు.. ఆ విషాన్ని మధ్యవర్తులు చాలా తక్కువ ధరకు వారి నుంచి కొంటారు. వీళ్లు వీళ్లకున్న నెట్‌వర్క్‌ ద్వారా అమ్ముతారు. ఇది చేతుల మారే కొద్ది ధర పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news