ప్ర‌కృతి విపత్తులను త‌ట్టుకుంటున్నాం.. : చంద్ర‌బాబు

-

రాజ‌కీయ కుట్ర‌లే త‌ల‌నొప్పిగా మారాయి

అమరావతి: ప్రకృతి వల్ల తలెత్తే సమస్యలు పరిష్కరించగలుగుతున్నా.. రాజకీయ కుట్రలు అంతకంటే తలనొప్పిగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడగానే విభజన సమస్యలు చుట్టుముట్టాయని.. అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ ఇబ్బంది పెడితే.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మరో రకంగా వివక్ష చూపిస్తోందన్నారు. దీనికి అదనంగా రాష్ట్రంలోని మరో పార్టీ సహాయ నిరాకరణతో అన్యాయం చేస్తోందన్నారు.

రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు సమస్యగా మారాయని.. వాటిని పట్టుదల, కసితో అధిగమిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మన హక్కులు డిమాండ్‌ చేస్తే దాడులు చేసే పరిస్థితి నెలకొందని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని అభిప్రాయపడ్డారు. ఐటీ దాడులు చేయడం ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారంలో పోటీ పడాలే తప్ప.. కక్ష సాధింపు వైఖరి సరికాదని హితవు పలికారు. న్యాయం, ధర్మం, మంచి పనులే శాశ్వతంగా ఉంటాయన్నారు.

తుపాను బాధిత ప్రజలకు అండగా ఉండాలని, వంశధార ఎడమ కాలువ గండ్లు పూడ్చే పనులు సాయంత్రానికల్లా పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. చెరువుల కట్టలు పటిష్టం చేసే పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. నష్టపోయిన రైతులు పంట బీమా అడుగుతున్నారని, ఆ కంపెనీలతో తక్షణమే చర్చించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంట బీమా ప్రయోజనం బాధిత రైతాంగానికి అందించాలని, ఇప్పటికే 35వేల హెక్టార్లలో ఎన్యూమరేషన్ పూర్తిచేశారన్నారు. మిగిలిన లక్ష హెక్టార్లలో పంటనష్టం అంచనా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు సిబ్బందిని, అధికారులను రప్పించుకోవాలని, పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని సూచించారు. రేపు తాను శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికల్లా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశంచేశారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులు, జిల్లాల కలెక్టర్లు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news