పోలవరం పూర్తికి 2025 వరకు గడువివ్వండి.. కేంద్రాన్ని కోరిన ఏపీ

-

పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి సమయం ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ప్రాజెక్టు తొలిదశ కింద నిధులు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌ సమర్పించిన ప్రతిపాదనపై గురువారం నాటి దిల్లీ సమావేశంలోనూ స్పష్టత రాలేదు. మే నెల ప్రారంభంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ.17,144 కోట్లతో తొలిదశ అంచనా వ్యయంగా పంపిన ప్రతిపాదనలపై ఇంకా అడుగు ముందుకుపడలేదు. నిధులు వచ్చేస్తున్నాయని రాష్ట్ర పెద్దలు చెబుతూ ఉన్నా, గురువారం నాటి సమావేశంలో తొలిదశ నిధులకు ఆమోదముద్ర వేయవచ్చని ప్రభుత్వం తరఫున ప్రచారం సాగినా అలాంటి అంశం ఏదీ సమావేశంలో చోటు చేసుకోలేదు.

రూ.550 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేసినట్లు కేంద్ర జల్‌శక్తి అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సమావేశం ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపైనే జరిగింది. ఏ పని ఎప్పటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారో ఆ ప్రణాళికలో ఒక్కరోజు కూడా గడువు మీరొద్దని కేంద్రమంత్రి ఏపీ అధికారులను హెచ్చరించారు.

పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే ఆలస్యం అయ్యాయని, ఇక ఒక్కరోజు కూడా గడువు మీరకుండా చూడాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రణాళికలో పేర్కొన్నట్లుగా పనులు పూర్తిచేయాల్సిందేనని అన్నారు. 2025 జూన్‌ నాటికి ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తికి గడువును ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించగా దానిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news