వరదల వల్ల దెబ్బతిన్న 2,000 కిలో మీటర్ల రహదారులు..!

-

వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, భవనాల సంరక్షణ విషయంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వరద ప్రభావిత జిల్లాలు కృష్ణా, గుంటూరు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన అధికారులతో మంత్రి జనార్ధన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో వరదలు, రోడ్లు, భవనాల పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సుమారు 2,000 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. రహదారులు, భవనాలకు ఎటువంటి నష్టం వాటిల్లినా వాటిని వెంటనే ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయం మరియు కంట్రోల్ రూమ్ కు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా బ్రిడ్జిలు దెబ్బతిన్న ప్రదేశాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలని, ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో వరదల పరిస్థితులు సద్దుమణిగే వరకు ఆర్ అండ్ బి శాఖ అధికారులకు సెలవులు రద్దు చేశామని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news