అరసవల్లి దేవాలయం లో వివాదంపై స్పందించింది సింగర్ మంగ్లీ. అరసవల్లి దేవాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి దర్శనంపై చాలా మంది విమర్శించడం బాధ కలిగించింది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపి కి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాటపాడాను. దాని తర్వాత రెండు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాను. అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా ప్రచారంలో పాల్గోనాల్సి వచ్చింది. కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్క మాట అనలేదు, దూషించలేదు. నేను ఎక్కడా పార్టీ జెండా దరించలేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాడాను, వైఎస్సార్సీపి ఒక్కటే కాదు, బిజెపి, టీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడాను. అప్పటికే నాపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు నా పాట దూరమయ్యింది. దీంతో చాలా అవకాశాలు కోల్పోయాను, అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ కారణంగానే 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపితో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పాటలు పాడాలని కోరినా సున్నితంగా తిరస్కరించాను. ఒక కళాకారిణీగా గుర్తించి ఎస్వీబిసి ఛానల్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఛానల్ అధికారులు నన్ను సంప్రదించారు. నేను ఆ పదవి స్వీకరించాలా వద్దా అని చాలా రోజులు తర్జన భర్జన పడ్డాను. ఇది రాజకీయ పదవి కాదని, అప్పటికే చాలా మంది కళాకారులు సలహాదారులుగా చేశారని నా శ్రేయోభిలాషులు సూచించారు. పైగా మా ఇంటి ఇలవేల్పు శ్రీవారికి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఆ పదవిని కొనసాగించానే తప్ప ఎక్కడా బహిరంగంగా ఆ పదవి గురించి ప్రకటించుకోలేదు. నేను పాటను నమ్ముకునే వచ్చాను కాని పార్టీలను, పదవులను నమ్ముకొని రాలేదని వేడుకుంటున్నాను.
నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఎక్కడా అనని మాటలను, ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలీకుండా కొందరుకావాలనే రాజకీయ లబ్ది కోసం ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు. ‘చంద్రబాబు గారికి నేను పాట పాడను అన్నదిముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసి చెబుతున్నాను’.మొదట్లో వైఎస్పార్సిపికి పాడిన కారణంగానే కావచ్చు 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరూ కూడ నన్ను సంప్రదించలేదు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంతపెద్ద మనిషిని నేను అంతమాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా ? 2019 ఎన్నికల్లోని విడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయటం చాలా బాధాకరం.