గంటా అటు వెళితే..రాజుగారు ఇటు వచ్చేస్తారా..?

-

గంటా శ్రీనివాసరావు….ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్ అయ్యే నేత. ఒక పార్టీలో కూడా నిలకడగా ఉండని గంటా మరోసారి జంపింగ్ చేయబోతున్నారని 2019 ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. టీడీపీ తరుపున విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా…ఓ సారి వైసీపీలోకి వెళ్తారని, మరోసారి బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే గంటా మాత్రం ఎటు వెళ్లకుండా అలాగే ఉన్నారు. అలా అని టీడీపీలో యాక్టివ్‌గా మాత్రం లేరు. కానీ ఇటీవల గంటా వైసీపీలో చేరిక లాంఛనమే అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అసలు గంటా చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. ఎంత ప్రచారం జరిగినా, ఎన్ని వార్తలు వచ్చినా గంటా మాత్రం సైలెంట్‌గా ఉంటూ, ఏపీ రాజకీయాలనే టెన్షన్ పెడుతున్నారు. గంటా పార్టీ మారతారా ? లేదా అని అటు వైసీపీ, టీడీపీలని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక గంటా వల్ల బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా బాగానే టెన్షన్ పడుతున్నారట. గంటా పార్టీ మారితే మార‌వ‌చ్చని, లేదా ఉండొచ్చని, కానీ ఏ పార్టీలో ఉంటారో క్లారిటీ ఇవ్వాలని, అలాగే రాజీనామా చేసి వెళితే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం కావాలిగా అన్నట్లు రాజు గారు మాట్లాడుతున్నారు.

అయితే గంటా టీడీపీని వీడి వైసీపీలోకి వెళితే, రాజుగారు టీడీపీలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ నుంచి పోటీ చేసి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా విష్ణు గెలిచారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలో దిగడంతో రాజు గారు ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో మిగతా బీజేపీ నేతలకంటే బెటర్‌గానే విష్ణు ఓట్లు సంపాదించారు. అయితే విష్ణు 2019 ఎన్నికల ముందే టీడీపీలోకి వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ గంటా నార్త్‌లో బరిలో దిగడంతో, ఆయన మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఇక ఇప్పుడు బీజేపీలోనే ఉంటూ టీడీపీ నేతలకంటే ఎక్కువగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పక్కా బాబు మనిషిలా న‌డుచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గంటా గనుక వైసీపీ వైపు వెళితే, వెంటనే రాజుగారు టీడీపీలోకి రావొచ్చని తెలుస్తోంది. మరి చూడాలి రాజు గారి రాజకీయం ఎలా ఉండబోతుందో..?

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news