బయట పోరుతో పాటు ఆ మంత్రికి ఇంటిపోరు కూడా ఎక్కువైందా…!

-

ప్రత్యర్ధి పార్టీతో గట్టి ఫైట్ చేస్తున్న మంత్రిగారికి సొంత నియోజకవర్గంలో కొత్త సమస్య వచ్చిందట. నేతల మధ్య విభేదాలు.. పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటున్నారట. గుమ్మనూరు జయరామ్‌. ఏపీ మంత్రి. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ESI స్కామ్‌ కేసులో మంత్రి జయరామ్‌పై కూడా టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వీటి నుంచి బయటపడేందుకు ఆపసోపాలు పడుతున్నారాయన. ఈ ఘటనకు కొద్దిరోజుల ముందే గుమ్మనూరులో పేకాట క్లబ్ వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపింది. ఇలా వరుస వివాదాలు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ సంకట సమయంలో మంత్రికి మద్దతుగా మాట్లాడేవారే కరువయ్యారు. కాలం కలిసి రావడం లేదో ఏమో కానీ.. ఇప్పుడు ఆలూరు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు కూడా మంత్రిగారికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట.


ఆలూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి బలమైన కేడర్‌ ఉంది. పార్టీలో మొదటి నుంచి ఉంటోన్న వారు పనులు కావడం లేదని జయరామ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అలాగే వర్గపోరు అధికమైందని సమాచారం. దేవనకొండ మండలంలో కొద్దిరోజుల క్రితం వైసీపీలోని రెండు వర్గాలు కర్రలతో కొట్టుకున్నాయి. జడ్పీటీసీ అభ్యర్థికి, పార్టీలోని మరో వర్గానికి అస్సలు పడటం లేదట. వీరికి ఎలా సర్ది చెప్పాలో మంత్రికి అర్థం కావడం లేదట.

మంత్రి సొంత మండలం చిప్పగిరిలోనూ అదే స్థాయిలో వర్గపోరు ఉందట. ఇక్కడ పేకాట క్లబ్‌ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కిన గుమ్మనూరు నారాయణ మంత్రికి సోదరుడు. ఈ మండలంలో నారాయణకు, జడ్పీటీసీ అభ్యర్థి విరూపాక్షి మధ్య పోరు కొనసాగుతోంది. పేకాట క్లబ్‌ వ్యవహారంలో నారాయణ పార్టీకి చెడ్డపేరు తెచ్చారనే అభిప్రాయంలో ఉన్నారట వైసీపీ వర్గాలు. హోలగొంద మండలం ఎల్లార్తిలోనూ వైసీపీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ విభేదాలు, గొడవలు శ్రుతిమించి రాగాన పడుతున్నాయే కానీ.. సమసి పోయే పరిస్థితి లేదట.

వీటిని మంత్రిగారి లైట్ తీసుకుంటే బలహీనంగా ఉన్న ప్రత్యర్థి పార్టీలు బలపడే అవకాశం ఉందని.. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండబోవన్న అంశాన్ని మర్చిపోకూడదని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారట. మరి.. మంత్రి జయరామ్‌ ఇప్పటికైనా ఆలూరు వైసీపీలోని సమస్యలు పరిష్కారానికి ఫోకస్‌ పెడతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news