కరోనా.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

-

అమరావతి : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని నిర్ణయించింది. ఉన్నతాధికారులు మినహా మిగతా ఉద్యోగులను రెండు బృందాలుగా విభజించి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయనుంది. ఒక బృందం ఒక వారం కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహిస్తే.. రెండో బృందం తర్వాత వారం విధులకు వచ్చేలా అవకాశం కల్పించింది. సచివాలయం విభాగాధిపతులు మొదలుకుని క్షేత్రస్థాయి వరకు ఈ విధానం వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వర్క ఫ్రమ్ హోమ్ అమల్లోకి రానుంది.

ఒకవారంలో విధులకు హాజరయ్యే ఉద్యోగులు అందరు ఒకేసారి కాకుండా.. వారి కోసం వేర్వేరు పనివేళలు కేటాయించారు. వారిలో ఒక బృందం ఉ.9.30 గంటలకు, రెండో బృందం 10 గంటలకు, మూడో బృందం 10.30 గంటలకు విధులకు హాజరుకానున్నారు. తద్వారా ఏ సెక్షన్‌లోనూ రద్దీ లేకుండా ఉద్యోగుల మధ్య తగినంత దూరం ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారిని అత్యవసర పని ఉంటే తప్ప అనుమతించవద్దని తెలిపింది.

ఇప్పటికే కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతోపాటు షాపింప్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేసింది. అలాగే విదేశాల నుంచి వచ్చినవారి వివరాలు సేకరించి వారిని క్వారంటైన్‌లకు తరలిస్తుంది. కాగా, ఇప్పటివరకు  ఏపీలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news