రాజధాని పరిధిలో పేదలకు ఇచ్చే టిడ్కో ఇళ్లకు సంబంధించి విక్రయ అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్ల కోసం స్థానిక తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పరిగణిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు.

రాజధాని అమరావతి పరిధిలోని అర్బన్ తహసీల్దార్లు లేకపోవడంతో ఆయా మండలాల తహసీల్దార్లనే టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ల కోసం జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా టిడ్కో ఇళ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. ఇందుకోసం తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా తాత్కాలికంగా గుర్తిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.