‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల్లో కామన్‌ పాయింట్స్‌ ఏంటో తెలుసా..!

-

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి సందడి చేయనున్నారు. ఒకరేమో గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ వస్తోంటే.. మరొకరేమో పూనకాలు లోడింగ్ అంటూ ఆడియెన్స్ లో జోష్ నింపుతున్నారు. ఈ మూవీస్ కు ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే.. ఈసారి ఈ హీరోల ఫ్యాన్సే సినిమాలు డైరెక్ట్ చేశారు. దీంతో ఈ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ ఇద్దరు ఫ్యాన్స్‌ సినిమాల కథలు, సినిమాల్లో ఉన్న కామన్‌ పాయింట్స్ ఏంటంటే?

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన గోపీచంద్‌ మలినేని ‘డాన్‌శీను’తో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఆ తర్వాత ‘బాడీగార్డ్‌’, ‘బలుపు’, ‘పండగ చేస్కో’, ‘విన్నర్’, ‘క్రాక్‌’ సినిమాలను తెరకెక్కించారు. 2010లో డైరెక్టర్‌గా ప్రయాణం ప్రారంభించిన ఆయనకు దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఫేవరెట్‌ యాక్టర్‌ బాలకృష్ణతో సినిమా తీసే అవకాశం లభించింది. అదే ‘వీరసింహారెడ్డి’.

1999లో విడుదలైన బాలకృష్ణ సినిమా ‘సమరసింహారెడ్డి’ మార్నింగ్‌, మ్యాట్నీ షో మిస్‌ అయినందుకు ఎంతో బాధపడ్డ ఫ్యాన్‌.. అదే హీరోతో సినిమా తీసే అవకాశం వస్తే? ఏం చేస్తాడో గోపీచంద్‌ అదే చేశారని బాలయ్య లుక్స్‌, ప్రచార చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. సినిమా షూటింగ్ సమయంలో ఓ కంటితో అభిమానిగా, మరో కంటితో దర్శకుడిగా బాలయ్యను చూశానని ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గోపీచంద్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన అభిమాని అయిన గోపీచంద్‌తో గొప్ప సినిమా చేయడం గర్వంగా ఉందని బాలకృష్ణ అదే వేడుకలో తెలిపారు.

మరో దర్శకుడు కె. బాబీ.. చిరంజీవికి పెద్ద అభిమాని. ‘ఇంద్ర’ సినిమా ప్రభావం తనపై ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్‌కు వచ్చేసిన బాబీ ఆ చిత్ర రచయిత చిన్నికృష్ణ దగ్గర కొంతకాలం పనిచేశారు. ‘నా అభిమానికావడం వల్లే బాబీకి నేను అవకాశం ఇవ్వలేదు. కష్టపడి పనిచేసే అతని వ్యక్తిత్త్వం చూసి ఇచ్చా. ఆయనకు నేను అభిమానినయ్యా’ అని మరో వేడుకలో వెల్లడించారు.

దర్శకుడు మలినేని గోపీచంద్‌ తెరకెక్కించిన ‘డాన్‌ శీను’, ‘బాడీగార్డ్‌’సహా పలు చిత్రాలకు స్క్రీన్‌ప్లే రాసిన బాబీ ‘పవర్‌’తో 2014లో డైరెక్టర్‌ అయ్యారు. అనంతరం, ‘సర్దార్ గబ్బర్‌సింగ్‌’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’ తెరకెక్కించారు. తన ఫేవరెట్‌ స్టార్‌తో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైలర్‌తోనే అభిమానులకు ‘పూనకాలు’ తెప్పించిన ఈ చిరు ఫ్యాన్‌ కమ్‌ డైరెక్టర్‌ సినిమాను ఎలా తీశారో తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

ఒకే హీరోయిన్‌..

ఈ రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసనే కథానాయిక. ‘వాల్తేరు వీరయ్య’ సరసన శ్రీదేవిగా, ‘వీరసింహారెడ్డి’లో ఈషా అనే పాత్రలో కనిపిస్తారు. రెండూ చలాకీ పాత్రలేనని పాటలు, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. ఒకే హీరోయిన్‌ నటించిన రెండు పెద్ద చిత్రాలు సంక్రాంతి సీజన్‌కు విడుదలవడం అరుదు.

ఒకటే నిర్మాణ సంస్థ..

ఈ రెండు సినిమాలకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. నిర్మాణ సంస్థ. రెండింటినీ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవి శంకర్‌లు నిర్మించారు. ‘వాల్తేరు వీరయ్య’కు సుమారు రూ. 140 కోట్లు, ‘వీరసింహారెడ్డి’కి దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్‌ పెట్టారు. ఒకే నిర్మాణ సంస్థలో రూపొందిన రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండడం, పైగా సంక్రాంతి బరిలో నిలవబోతుండడం టాలీవుడ్‌లో ఇదే ప్రథమం. ఈ బ్యానర్‌లో చిరు, బాలయ్య నటించడం ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Latest news