తెలుగు రైతులకు కరోనా దెబ్బ…!

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బ… ఇప్పుడు మన తెలుగు రైతులకు కూడా గట్టిగానే తగిలినట్టు తెలుస్తుంది. ఇప్పటికే గుంటూరు మిర్చి రైతులకు కరోనా దెబ్బ తగిలింది. ఎగుమతులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పంట చేతికి వచ్చినా సరే ఎగుమతులు లేకపోవడంతో ఇప్పుడు రైతుల్లో ఆందోళన మొదలవుతుంది. ఎప్పటికి అవి అమ్ముడవుతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు.

ఇక ఇప్పుడు కరోనా దెబ్బ రొయ్య రైతులకు కూడా గట్టిగానే తగిలింది. మన దేశం నుంచి చైనా, జపాన్‌ తదితర దేశాలకు రొయ్యల ఎగుమతి తగ్గిపోయింది. దీనితో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు గత వారంరోజులుగా రొయ్యల ధరలను భారీగా తగ్గించారు. అటు రొయ్యల మేత కూడా దిగుమతి తగ్గింది అని చెప్తూ ధరలను భారీగా పెంచేశారు. కరోనా పేరుతో గత వారంరోజులుగా కేజీ రొయ్యలకు రూ.30 వరకు తగ్గించారు.

మన రాష్ట్రానికి విదేశాలకు రొయ్య ఎగుమతి ఎక్కువగా ఉంటుంది. వారం రోజుల క్రితం 100 కౌంటు రొయ్యల ధరలు రూ. 240 ఉండగా ఇప్పుడు రూ.210, 90కౌంటు రొయ్యలు రూ.250 ఉండగా ప్రస్తుతం రూ.220కు కొనుగోలు చేస్తున్నారు. 80 కౌంటు రొయ్యల ధరలు వారం రోజుల క్రితం రూ.260 ఉండగా ఇప్పుడు రూ.230, 70 కౌంటు రొయ్యల ధరలు 270 ఉండగా ఇప్పుడు రూ.240లు, 60కౌంటు రొయ్యలు 320 ఉండగా ఇప్పుడు రూ.280కి రైతుల వద్ద నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news