నిన్న అదృశ్యమై ఇవాళ చెరువులో శవంగా తేలిన బాలుడు

-

హైదరాబాద్​లో నిన్న అదృశ్యమైన బాలుడు ఇవాళ చెరువులో శవమై కనిపించాడు. ఈ విషాద ఘటన నాగోల్​లో చోటుచేసుకుంది. అయ్యప్పకాలనీలో నివసించే షేక్షావలీ, హేమలత దంపతుల కుమారుడు సాహిద్‌ నిన్న తప్పిపోయాడు. పరిసర ప్రాంతాల్లో వెతికినా కనిపించకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి వరకు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు.

కుటుంబసభ్యులు అనుమానంతో సమీపంలోని చెరువు వద్ద వెతికారు. అప్పటికే చనిపోయి ఉన్న బాబు శవం చెరువులో తేలి ఉండటాన్ని గమనించి.. తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. అప్పటిదాక కళ్ల ముందు ఆనందంగా ఆడుకున్న తమ కన్నబిడ్డ క్షణాల్లో మాయమై నిర్జీవంగా చెరువులో తేలడం చూసి గుండెలవిసేలా రోదించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సాహిద్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తమ బిడ్డ చెరువు వైపు ఎప్పుడూ వెళ్లడని.. ఎవరో కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ మృతికి గల కారణాన్ని తెలుసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news