Dussehra: విజయాలనొసగే పండుగే దసరా!!

-

హిందువుల పండుగల్లో అత్యంత ప్రధానమైనదిగా ప్రసిద్ధికెక్కినది. దేశవ్యాప్తంగా ఆచరించేవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అటువంటి ప్రధాన పండుగల్లో దసరా ఒకటి. దక్షిణాయనంలో తొలి ఏకాదశి అనంతరం వినాయక చవితి తర్వాత దసరా వరుసగా వచ్చే పండుగలు. వీటిల్లో చిన్నా పెద్ద, పేద, ధనిక అందరూ ఆనందోత్సవాలతో జరుపుకొనే పండుగ దసరా. అసలు దసరా ఎందుకు జరుపుకొంటారు అంటే… దుర్గాదేవి మహిషాసురుడినే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. దీన్నే విజయదశమిగా పిలుస్తారు.

శరత్ కాలంలో వచ్చే శరన్నవరాత్రులను దేశమంతటా ఘనంగా నిర్వహిస్తారు కాబట్టే ఈ నవరాత్రులకు అంత ప్రాముఖ్యం ఏర్పడింది. దుర్గాదేవి తొమ్మిది రాత్రులపాటు రాక్షసులను వెంటాడి, సంహరించింది. చివరికి పదో రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా పదో రోజున విజయదశమిగా పాటిస్తున్నాం. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మనలోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గానవరాత్రుల పూజలోని అంతరార్థం. ప్రతి ఏటా ఆశ్వయుజ పాడ్యమి నుంచి దశమి వరకు శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. చివరి రోజునే దసరా, విజయదశమిగా జరుపుకొంటాం. అమ్మవారి జన్మ నక్షత్రం శ్రవణం. కాబట్టి శ్రవణా నక్షత్రం ఉన్నప్పుడే విజయదశమి పూజను చేస్తారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news