కోట్లు గుమ్మరిస్తే కానీ కార్పోరేటర్ కాలేరా ?

-

గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయిన నెక్స్ట్‌ మినిట్‌ నుంచే ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. 20న నామినేషన్లు ముగిశాయి. పట్టుమని పదిరోజుల గ్యాప్‌ లేకుండానే పోలింగ్‌… మూడు రోజుల్లోనే కౌంటింగ్‌.. అదే రోజు రిజల్ట్స్‌. అన్ని పార్టీలకూ రణమా.. శరణమా.. అన్నట్టుమారింది బల్దియా వార్‌. సమయం తక్కువ.. చేయాల్సింది ఎక్కువ. హే…భగవాన్‌ అని తలలుపట్టుకుంటున్నారు అభ్యర్థులు. కోట్లు గుమ్మరిస్తే కానీ గ్రేటర్లో కార్పొరేటర్‌ కాలేరా..

సమయం లేదు మిత్రమా… రణమా శరణమా.. అన్నట్టుంది బల్దియా వార్‌. నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ ఒకే రోజు విడుదలై పార్టీలను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. చూస్తుండగానే నామినేషన్లు ముగిశాయి. ప్రచారానికి పట్టుమని పదిరోజులు కూడా లేదు. జెండాలు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, చాటింపుల హడావిడికి టైం కూడా లేదు. మరి ఖర్చు మాటేంటి..? ఇలా అయినా ఖర్చు తగ్గుతుందా..? ఎన్ని రోజులు ఉందన్నది కాదు.. ఎంత ఖర్చుచేశామన్నదే ముఖ్యమా..?

సాధారణంగా ఎన్నికలకు నెలరోజుల ముందు నుంచే హడావిడి మొదలయ్యేది. వందలాదిమంది కార్యకర్తలతో అభ్యర్థుల ఇంటిముందు జాతర కనిపించేది. ర్యాలీలు, సభలు, సమావేశాలు.. ప్రచారాల పర్వం కొనసాగేది. జిందాబాద్‌… వర్ధిల్లాలి… గుర్తుకే మన ఓటు.. అంటూ నినాదాలు హోరెత్తేవి. కానీ.. సీటు కన్ఫార్మ్‌ అయ్యేదాకా ఊపిరిబిగపట్టుకుని ఎదురుచూశారు అభ్యర్థులు. వెంటనే నామినేషన్లు. చూస్తుండగానే పోలింగ్‌ డేట్‌ కూడా దగ్గరపడుతోంది.

ఎన్నికేదైనా… మద్యం ఏరులై పారాల్సిందే. డబ్బుల సంచులు గుమ్మరించాల్సిందే. కార్యకర్తలు, అనుచరులు, అభిమానగళానికి బీరు, బిర్యానీలు డెయిలీ ఇనాం, ఓటర్లకు డబ్బులు, మద్యం చొప్పున కోట్ల రూపాయలు ఖర్చయ్యేవి. సమయం తక్కువగా ఉండటంతో… అభ్యర్థుల వద్ద డబ్బు ఉన్నా.. ఖర్చుపెట్టలేని పరిస్థితి వచ్చింది. ఏం చేసినా పది రోజులే. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఏడాది ఖర్చు తగ్గేలా అనిపిస్తోంది.

ఫ్లెక్సీ ప్రింటింగ్‌ షాపులు, కరపత్రాల ప్రింటింగ్‌ షాపులు రద్దీగా కనిపించేవి. కానీ.. ఇప్పటికిప్పుడు ఆర్డర్‌ ఇచ్చినా ప్రింటింగ్‌ అవడానికే రెండు రోజులు పట్టేలా ఉంది. ఈసారి వీటికి దూరంగా ఉన్న అభ్యర్థులు ఉన్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీల జోలికి వెళ్లకుండా… ఇంటింటి ప్రచారానికే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. వందలాది మంది కార్యకర్తలతో రోడ్‌ షోలు, బైక్‌ ర్యాలీలు చేసే అభ్యర్థులు… కాలినడకన గల్లీగల్లీ తిరిగి ప్రచారం చేయడమే బెటర్‌గా భావిస్తున్నారు.

వెంటతిరిగే కార్యకర్తల్లో మగవారికి వెయ్యిరూపాయలు.. ఆడవారికి ఏడు వందల రూపాయలు ఇచ్చేవారు. ఇవికాకుండా… మూడు పూటలా భోజనం… రాత్రి మద్యం అందించేవాళ్లు. ఇలా ఎన్నిరోజులు ఎంతమంది వస్తే అంతమంది చొప్పున ఖర్చేచేసేవాళ్లు. ఇలా… రోజుకు లక్షల రూపాయలు ఖర్చయ్యేవి. కానీ.. ఈసారి సమయం తక్కువ ఉండటంతో… వారం రోజులకు కలిపి ఒక్కో వ్యక్తికి 5 వేల రూపాయల చొప్పున ఒకేసారి ప్యాకేజ్‌ మాట్లాడుకుంటున్నారట. పోలింగ్‌ రోజు తర్వాత డబ్బులు అందజేసేలా కాంట్రాక్ట్‌ మాట్లాడుకుంటున్నారట. ఇలా చేయడం వల్ల… కార్యకర్తలంతా మరో అభ్యర్థి దగ్గరకు వెళ్లకుండా.. తమతోనే ఉండేలా ప్లస్‌ అవుతోందట.

ఉన్న పది రోజుల్లో బైకు ర్యాలీలు, రోడ్‌ షోలు చేస్తే రోజులు వృథా అవుతాయి అనుకుంటున్నారు అభ్యర్థులు. ర్యాలీల పేరుతో రోడ్డువెంట తిరిగేకంటే ఇంటింటి ప్రచారంతో ప్రతీ ఓటర్‌ కి చేరువ అయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. బైక్‌ ర్యాలీలకు లక్షలు ఖర్చుపెట్టాల్సిందే. వాటికంటే.. ఇంటింటికి వెళ్లి ఓటర్లకు డబ్బులు మద్యం పంచి .. ఓటేయ్యాలని అడగటమే బెస్ట్‌ అనుకుంటున్నారట. ఖర్చు తక్కువ… ఫలితం ఎక్కువ.

ఒక్కో కార్పొరేటర్‌ అభ్యర్థి తక్కువలో తక్కువ కోటి రూపాయలు ఖర్చుపెట్టాల్సిందే. కోటి పెట్టినా గెలుస్తాడన్న నమ్మకం లేని డివిజన్‌లు కూడా నగరంలో ఉన్నాయి. నువ్వా నేనా… పంతం నీదా నాదా అనుకున్న ఏరియాల్లో ఖర్చు మరింత ఎక్కువే. కానీ.. ఈసారి అలా లేదు. డబ్బుతో కంటే తెలివితో పనిచేయాలని భావిస్తున్నాయి అన్ని పార్టీలు. ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి తప్ప.. ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వృథా చేసుకోవడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news