మెగా స్టార్ చిరంజీవి సినిమాలోకి రావడానికి కారణం ఆయనే..!

-

సహాయ నటుడిగా సినీకెరీర్​ ప్రారంభించి.. ప్రతినాయక పాత్రల్లో మెరిసి.. ఆపై కథానాయకుడిగా తెలుగుతెరపై మెగాస్టార్‌లా కొలువుదీరిన చిరంజీవి జీవిత ప్రయాణం ఆద్యంతం స్ఫూర్తిదాయకమే. ఆయన కళామతల్లి వైపు వేసిన తొలి అడుగులను, ఈ స్థాయికి చేరుకోవడంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. కానీ, అసలు చిరులోని మెగాస్టార్​ను‌ తొలుత గుర్తించింది ఎవరో తెలుసా? ఆయన్ని వెండితెరపైకి నడిపించింది ఎవరో తెలుసా? దీనికి చిరంజీవి ఓ సందర్భంలో సమాధానమిచ్చారు.

“నా తండ్రి ఎస్సైగా చీరాలలో పనిచేస్తున్న రోజుల్లో అదే స్టేషన్‌లోని ఓ కానిస్టేబుల్‌ పనిచేస్తుండేవారు. ఆయన నేను చెప్పే సినిమా డైలాగ్స్‌, చేసే యాక్షన్‌ మూమెంట్స్‌ను చాలా ఇష్టపడేవారు. నా అభినయంపై ప్రశంసలు కురిపించేవారు. కానీ, ఆయన మాటల్నెప్పుడూ అంత సీరియస్‌గా తీసుకునేవాడిని కాదు. ఓరోజు ఆయన నా దగ్గరకొచ్చి ‘బాబు మిమ్మల్ని చూస్తుంటే అచ్చు బాలీవుడ్‌ హీరో శత్రుఘ్నసిన్హా లాగే ఉన్నారు. ఆయనలాగే చేస్తున్నారు. మీరు అర్జెంటుగా సినిమా ఫీల్డ్‌కు వెళ్లిపోండి’ అన్నారు. ఆరోజు ఆయన అన్న మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. ఆయనక్కడితో ఆగకుండా నన్ను అప్పటికప్పుడు స్టూడియోకు తీసుకెళ్లి ఫొటోలు తీయించి మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. వాటి వల్లే నేను అడయార్‌ ఫిలిమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు దక్కించుకున్నా.

అలా ఓ సామాన్య కానిస్టేబుల్‌ నాలో నింపిన స్ఫూర్తితోనే ఈరోజున మీ ముందు నిలబడగలిగాను. ఇంతకీ ఆ కానిస్టేబుల్‌ మరెవరో కాదు.. చీరాల పక్కనే ఉన్న పేరాలకు చెందిన కానిస్టేబుల్‌ వీరయ్య” అంటూ నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు చిరు.చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్​గా నటిస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు చిత్రీకరణ జరుపుకొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు సాయంత్రం 4గంటలకు ఈ సినిమా మోషన్ పోస్టర్​ను విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news