“ఇండియాకు వెళ్లను.. సుప్రీం కోర్టుకు వెళ్తా” .. లండన్ హైకోర్టు తీర్పుపై నీరవ్ మోదీ

-

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తనను భారత్‌కు వెళ్లనని అంటున్నాడు. ఇండియాకు అప్పగించాలన్న తీర్పును సవాల్ చేస్తూ యూకే సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవడానికి అనుమతి కోరుతూ లండన్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు. మానసిక అనారోగ్యం దృష్ట్యా తనను భారత్‌కు అప్పగించొద్దంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని ఇటీవలే కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునే ముప్పు ఉందన్న కారణంతో నీరవ్‌ను భారత్‌కు అప్పగించకుండా ఉండటం సరికాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.11 వేల కోట్ల మేరకు మోసగించి నీరవ్‌ మోదీ బ్రిటన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే.

నీరవ్‌ను భారత్‌కు అప్పగించడానికి సమ్మతిస్తూ గతేడాది అప్పటి హోంమంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నీరవ్‌ లండన్‌ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. ఈ అప్పీల్‌పై ఈ ఏడాది ఆరంభం నుంచి విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. హైకోర్టు తీర్పును 14 రోజుల్లోగా నీరవ్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసుకునే వెసులుబాటు ఉండడంతో తాజాగా ఆయన అందుకు అనుమతి కోరాడు.

అక్కడ కూడా ఆయనకు ప్రతికూల నిర్ణయం వెలువడితే.. యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్‌ నుంచి 39వ రూల్‌ను కోరుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ అవకాశంతో నీరవ్‌ తనను భారత్‌కు అప్పగించకుండా ప్రభుత్వానికి వినతి చేసుకోవచ్చు. నీరవ్‌ను భారత్‌కు రప్పించే విషయంలో సందిగ్ధం వీడడానికి మరికొంత కాలం పట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news