చిక్కుల్లో బ్రిటన్​ ప్రిన్స్​ ఛార్లెస్‌.. బిన్​ లాడెన్​ కుటుంబం నుంచి విరాళం

-

బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ చార్లెస్‌ చిక్కుల్లో పడ్డారు. అల్​ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి ఆయన స్థాపించిన ఛారిటబుల్​ ట్రస్ట్​ ఒక మిలియన్ పౌండ్లు విరాళంగా తీసుకున్నట్లు ది సండే టైమ్స్ వెల్లడించింది. ఈ ఆరోపణలపై లండన్​ పోలీసులు విచారణ చేపట్టారు. 2013లో లాడెన్​ కుటుంబానికి చెందిన బకర్​తో సమావేశమైన ప్రిన్స్ చార్లెస్​.. ఈ విరాళాన్ని అంగీకరించినట్లు ప్రచురించిది. చార్లెస్​ సన్నిహితులు కొందరు విరాళాన్ని వెనక్కి ఇచ్చేయాలని సూచించారని సండే టైమ్స్ పేర్కొంది.

ఈ వార్తలపై స్పందించిన చార్లెస్​ కార్యాలయం.. ప్రిన్స్​ వ్యక్తిగతంగా విరాళాన్ని స్వీకరించారన్న విషయాన్ని ఖండించింది. పూర్తి శ్రద్ధ వహించి ఈ విరాళాన్ని స్వీకరించామని ది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటబుల్​ ఫండ్​ స్పష్టం చేసింది. ట్రస్టు ధర్మకర్తలు అందరూ కలిసే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపింది.

ది ప్రిన్స్ ఆఫ్​ వేల్స్​ ఛారిటబుల్​ ఫండ్​ను 1979లో స్థాపించారు. వివిధ రూపాల్లో వచ్చిన విరాళాలను బ్రిటన్​తో పాటు కామన్​వెల్త్, ఇతర దేశాల్లో అభివృద్ధికి వినియోగిస్తారు. 2001లో అమెరికా ట్విన్‌ టవర్స్‌ కూల్చి దాదాపు 3000 మందిని పొట్టనబెట్టుకున్న అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను.. 2011 మే 2న అమెరికా దళాలు హతమార్చాయి. పాకిస్థాన్​లోని​ అబొట్టాబాద్‌ కంపౌండ్‌లో నక్కిన లాడెన్‌ను యూఎస్‌ నేవీ సీల్‌ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్‌ చేపట్టి మట్టుబెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news