మేడిగడ్డ పర్యటన వేళ కేటీఆర్ ప్రభుత్వానికి కీలక రిక్వెస్ట్..!

-

బీఆర్ఎస్ నేతల బృందం ఇవాళ మేడిగడ్డ పర్యటనకు వెళ్లింది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన పిల్లర్లను పరిశీలించింది. ఈ సంద్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు పగ, కోపం ఉంటే రాజకీయంగా మాపై తీర్చుకుంటే ఇబ్బందిలేదని.. కానీ రైతులు, రాష్ట్రంపై పగ పట్టొద్దని కోరారు. 1.6 కిలోమీటర్ల మేడిగడ్డ బ్యారేజీలో కేవలం 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉందని తెలిపారు. చిన్న సమస్యను ప్రభుత్వం భూతద్దంలో పెట్టి చూపిస్తోందని మండిపడ్డారు. గతంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోయాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాగర్జున సాగర్, శ్రీశైలం ప్రాజక్టుల్లోనూ లీకేజీలు వచ్చాయని తెలిపారు.

సాగర్, శ్రీశైలంలో వచ్చిన లీకేజీలను తాము రాజకీయం చేయలేదన్నారు. నిపుణుల సలహాలు తీసుకుని మేడిగడ్డను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటన సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుపెట్టిన బారికేడ్లను దాటుకుని బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా బ్యారేజీపైకి దూసుకొచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గేట్లను మూసివేసి బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news