ఇక‌పై డిజిట‌ల్ చెల్లింపుల సంస్థ‌లు కూడా నెఫ్ట్‌, ఆర్టీజీఎస్ సేవ‌ల‌ను అందించ‌వ‌చ్చు: ఆర్‌బీఐ

-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిజిటల్ చెల్లింపు సంస్థలకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్ (నెఫ్ట్‌), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) సౌకర్యాలను విస్తరించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధ‌వారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిన్‌టెక్, డిజిట‌ల్ చెల్లింపు సంస్థల ద్వారా కూడా నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ద్వారా డబ్బులు బదిలీ చేయవ‌చ్చ‌న్నారు. ఇప్పటి వరకు బ్యాంకులు మాత్రమే ఆర్టీజీఎస్, నెఫ్ట్ చెల్లింపుల‌ సౌకర్యాల‌ను ఉపయోగించడానికి అనుమతించబడ్డాయి. కానీ ఇక‌పై డిజిట‌ల్ చెల్లింపు సంస్థ‌లు కూడా ఈ సేవ‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందించ‌వ‌చ్చు.

now digital payment companies can also give neft and rtgs services

ఈ సదుపాయాన్ని విస్తరించ‌డం ద్వారా ఆర్థిక వ్యవస్థలో స‌మ‌స్య‌లు మ‌రింత త్వ‌ర‌గా ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని ఆర్‌బీఐ తెలియ‌జేసింది. అలాగే దేశంలో డిజిటల్ ఆర్థిక సేవలను ప్రోత్సహించేందుకు కూడా ఇది సహాయపడుతుంది. రెపో, రివర్స్ రెపో రేటుల‌ను స్థిరంగా ఉంచిన‌ట్లు కూడా శ‌క్తికాంత దాస్ తెలిపారు. రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద ఉందని అన్నారు.

వృద్ధి స్థిరంగా లేనంత వరకు పాలసీ రేటు అలాగే ఉంటుందని దాస్ చెప్పారు. అంటే.. మీ ఇంటి రుణ ఈఎంఐ, ఆటో రుణ ఈఎంఐలు అలాగే ఉంటాయి. వ‌డ్డీల్లో మార్పులు ఉండ‌వు. కాగా ఆర్‌బీఐ గవర్నర్ 2021-22 సంవత్సరానికి 10.5 శాతం జీడీపీని అంచనా వేశారు. అలాగే టీఎల్‌టీఆర్‌ఓ పథకం వ్యవధిని 6 నెలల‌కు పెంచారు. 30 సెప్టెంబర్ 2021 వ‌ర‌కు ఈ వ్య‌వ‌ధిని పొడిగిస్తున్నట్లు దాస్ తెలిపారు. ఆర్‌బీఐ తన వివిధ సాధనాల ద్వారా మార్కెట్లో తగిన ద్రవ్య సహకారాన్ని అందిస్తూనే ఉంటుందని శక్తికాంత దాస్ తెలిపారు.

కాగా 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి, రెండవ త్రైమాసికాల‌లో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.2 శాతం, మూడవ త్రైమాసికంలో 4.4 శాతం, నాలుగ‌వ త్రైమాసికంలో 5.1 శాతంగా ఎంపీసీ అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంక్ లక్ష కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బాండ్ల కొనుగోలు కొనసాగుతుందని చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ ఏప్రిల్ 15న రూ.25 వేల కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తుంద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news