కరోనా విజృంభణ… లాక్‌డౌన్‌పై మోదీ ఏమ్మన్నారంటే..!

-

భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో కరోనా కట్టడి, వాక్సినేషన్ వంటి అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక పలు సూచనలు చేసారు. కరోనాను కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. రెండో దశలో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. మరోసారి మనం కఠిన సవాల్‌ ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

ఇక కరోనాను కట్టడి చేసేందుకు 3-టీ ఫార్ములాను అనుసరించాలని సూచించారు. భారీ సంఖ్యలో టెస్టింగ్‌ చేయాలని, ట్రేసింగ్‌, ట్రాకింగ్‌ చేపట్టాలన్నారు. శాంపిల్స్‌ సేకరణ అత్యంత కీలకమని, భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఇక మొత్తం టెస్టుల్లో 70 శాతం ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధించారన్న ప్రధాని… దానిని రాత్రి కర్ఫ్యూకు బదులుగా కరోనా కర్ఫ్యూ అని పిలిస్తే బాగుంటుందని అన్నారు. ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌గా నిర్వహించాలన్న మోదీ…. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కోరారు. కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు.

దేశ ప్రజలు మరోసారి లాక్‌డౌన్‌పై భయపడుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కూడా మోదీ స్పష్టతనిచ్చారు. గతంలో కరోనా కట్టడికి కావాల్సిన మౌలిక వసతులు, తగిన వ్యూహాలు లేకపోవడంతో లాక్‌డౌన్ విధించాల్సి వచ్చిందని… కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.దేశంలో లాక్‌డౌన్‌ విధించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని మోదీ వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది. వచ్చే మూడు వారాలు భారత్‌కు అత్యంత కీలకమని… టెస్టుల విషయంలో నిర్లక్ష్యం, పొరపాట్లు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికారు. కొన్ని రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం కరోనా అంశంపై పెద్దగా దృష్టి సారించడం లేదని అన్న మోదీ… కరోనా టెస్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పునరుద్ఘాటించారు. దేశంలోనే వ్యాక్సిన్ల కొరత లేదని… వ్యాక్సిన్ల లభ్యత ఎక్కువగా ఉందని స్పష్టం చేసారు. ఒక్క రోజులోనే 40లక్షల మందికి టీకాలు వేయగలిగామని గుర్తు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news