ఈ ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి రానున్న కొత్త నిబందనలు ఇవే..

-

నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. దీంతో కొత్త నిబంధనలు కూడా అమల్లోకి రానున్నాయి. మరి ఆ రూల్స్ ఏంటి? అవి ప్రజలపై ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా తెలుసుకుందాం.

పీఎఫ్ ఖాతాపై పన్ను: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఐటీ నిబంధన (25వ సవరణ) 2021ను అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో EPF ఖాతాలోకి వెళ్లే మొత్తాల్లో రూ.2.5 లక్షల వరకే పన్ను ఉండనుంది. ఇది దాటితే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది.

 

క్రిప్టో పన్ను: దేశంలో క్రిప్టో ఆస్తుల పన్ను విధానం అమల్లోకి రానుంది. 30 శాతం పన్ను, 1 శాతం TDS వేయనున్నారు. నష్టాలతో సంబంధం లేకుండా క్రిప్టో కరెన్సీల్లో వచ్చే లాభాలపై పన్ను చెల్లించాల్సిందే.

పాన్ కార్డు లింకేజీపై జరిమానా: పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మొదటి మూడు నెలలు రూ.500, ఆ తర్వాత 9 నెలలు రూ.1,000 చొప్పున జరిమానా చెల్లించాలి. 2023 మార్చి 31 లోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ చెల్లదు. ఆ పాన్ కార్డ్ ఇన్ యాక్టివ్‌గా మారుతుంది. ఆ పాన్ కార్డును లావాదేవీల్లో ఉపయోగించడానికి వీలుపడదు.

బ్యాంకుల్లో పే సిస్టమ్‌ అమలు: ఏప్రిల్‌ 1 నుంచి పాజిటివ్‌ పే సిస్టమ్‌ను అమలు చేస్తామని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. దీంతో వెరిఫికేషన్‌ లేకుండా పాజిటివ్‌ పే సిస్టమ్‌ కింద చెక్‌ పేమెంట్లు లాంటివి కుదరవు. రూ.10 లక్షలు ఆపై మొత్తాల చెక్కులకు ఈ నిబంధన తప్పనిసరి చేసింది ఆర్బీఐ. ఇక సేవింగ్స్‌ అకౌంట్లో నెలసరి కనీస నగదు పరిమితిని రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచుతుంది యాక్సిస్‌ బ్యాంక్‌.

పోస్టాఫీసు పథకాలు: టైం డిపాజిట్‌ అకౌంట్‌, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీం, నెలసరి ఆదాయ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలంటే సేవింగ్స్‌ ఖాతా లేదా బ్యాంక్‌ అకౌంట్‌ ఉండటం తప్పనిసరి. స్మాల్‌ సేవింగ్స్‌లో డిపాజిట్‌ చేసిన మొత్తాలపై అందుకునే వడ్డీ ఏప్రిల్‌ 1 నుంచి సేవింగ్స్‌ అకౌంట్‌, పోస్టాఫీస్‌ బ్యాంక్‌ అకౌంట్లలోనే జమవుతుంది. పోస్టాఫీస్‌ స్మాల్‌ సేవింగ్స్‌ ఖాతాతో పోస్టాఫీస్‌ ఖాతా లేదా ప్రస్తుత బ్యాంక్‌ ఖాతాను అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

ఐటీ రిటర్నులు: ఐటీ రిటర్నుల్లో తప్పులు జరిగినట్లయితే పన్ను చెల్లింపుదారులు అప్‌డేట్‌ చేసిన రిటర్నును దాఖలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండేళ్ల లోపు ఈ వెసులుబాటు ఉంటుంది.

NPS కోతలు: కేంద్ర సర్కార్‌ ఉద్యోగుల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులూ.. తమ కనీస వేతనం, డీఏలో 14 శాతం వరకు కంపెనీ ద్వారా NPS నిధి కోసం సెక్షన్‌ 80సీసీడీ(2) కింద కోతలకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

GST మార్పు: పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ కేంద్ర బోర్డు.. రూ.20 కోట్లకుపైగా టర్నోవర్‌ ఉన్న వ్యాపారులను బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్‌ ఇన్వాయిస్‌ను తీయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రూ.50 కోట్ల వరకు టర్నోవర్‌ ఉన్న వ్యాపారులకే ఇది వర్తించేది. దీంతో ఇన్వాయిస్‌ లేకపోతే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రాదు. పైగా జరిమానాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సొంతింటి కల సాకారం కష్టతరం: సామాన్యుడి సొంతింటి కల సాకారం ఇప్పుడు కష్టతరం కానుంది. మొదట ఇల్లు కొనుగోలు చేసేవారికి సెక్షన్‌ 80EEA కింద ఇస్తున్న పన్ను మినహాయింపు అనేది ఏప్రిల్‌ 1 నుంచి ఉండదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యంగా మధ్యతరగతి వారిపై ఇంటి కొనుగోలు భారం కానుంది.

మందుల ధరలు పెంపు: ఏప్రిల్‌ 1 నుంచి మందుల ధరలు కూడా పెరగనున్నాయి. పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీబయోటిక్స్‌, ఫినోబార్బిటోన్‌, ఫెనిటోయిన్‌ సోడియం, అజిత్రోమైసిన్‌, యాంటీ వైరల్‌ వంటి అనేక మందుల ధరలు పెరగనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ మందుల ధరలు 10 శాతం పెరిగే అవకాశం ఉంది.

కరోనా చికిత్సపై పన్ను మినహాయింపు: ఇక కోవిడ్‌ చికిత్సకు అయ్యే ఖర్చులపై పన్ను మినహాయింపును పొందవచ్చు. అలాగే కరోనాతో ఎవరైనా మరణిస్తే.. ఏడాదిలోగా వారి కుటుంబ సభ్యులు పొందే సొమ్ముపైనా పన్నులు ఉండవు. రూ.10 లక్షల వరకు పరిమితి ఉంటుంది. ఇక అంగవైకల్యంతో బాధపడుతున్నవారి తల్లిదండ్రులు, సంరక్షకులు.. బాధిత వ్యక్తి కోసం తీసుకునే బీమాపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

గ్యాస్‌ సిలిండర్‌ ధరలు: ఇక ప్రతినెల 1వ తేదీన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతినెలా మాదిరిగానే ఏప్రిల్‌ 1న గ్యాస్‌ ధరలు తగ్గడం, పెరగడం అనేది జరగనుంది. ఇటీవల గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెంచింది. ఇప్పుడు కూడా మళ్లీ పెరిగే అవకాశం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news