వక్ఫ్ బోర్డుల్లో సవరణలకు కేంద్రం ప్రయత్నం.. బీజేపీ డేరింగ్ స్టెప్

-

వక్ఫ్ బోర్డుల్లో పారదర్శకత తెచ్చేoదుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ముస్లింల మత, ధార్మిక ఉపయోగాల కోసం దానంగా వచ్చిన ఆస్తులను కాపాడే ఉద్దేశంతో పూర్వం వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ముస్లింలలో పురుషులు మాత్రమే ఈ బోర్డుల్లో ఉంటున్నారు. ఇకపై ముస్లిం మహిళలతో పాటు ముస్లిమేతరులకు కూడా ఇందులో చోటు కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చట్టంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. పలు సవరణలతో చట్టం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బిల్లును లోక్ సభలో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో చేసిన 40 సవరణలకి ఇప్పటికే కేంద్ర మంత్రి మండలి ఆమోదం వేసింది.

waqf board

వక్ఫ్ చట్టం 1995 ను యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ , ఎంపవర్ మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్ మెంట్ యాక్ట్ 1995గా మార్చుతూ తాజాగా లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఇక ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను ఎంపీలకు అందించారు. ఈ బిల్లులో అభ్యంతరాలు, వాటికి సంబంధించిన వివరాల ప్రకారం ప్రస్తుత వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ని తొలగించేందుకు కేంద్రం నిర్ణయించింది. ట్రిపుల్ తలాక్ తర్వాత కేంద్రం తీసుకుంటున్న కీలక నిర్ణయం ఇదే.

ట్రిపుల్ తలాక్ నిర్ణయం రద్దును ముస్లిం మహిళలు స్వాగతించారు. ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లును కూడా ముస్లిం మహిళలు సమర్ధిస్తారని కేంద్రం భావిస్తోంది. కాగా వక్ఫ్ బోర్డు కు సంబంధించిన ఆస్తులను పర్యవేక్షించే అధికారం కేవలం సంబంధిత బోర్డులకు మాత్రమే ఉంది. ఈ పరిమితిని ఇప్పటి నుంచి తగ్గించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ర్ట వక్ఫ్ బోర్డుల్లో ఇక ముస్లిమేతరులతో పాటు మహిళలకు కూడా అవకాశం కల్పించేలా చట్టం తేబోతున్నది. కనీసం ఐదేళ్లు ఇస్లాంను పాటిస్తూ సొంత ఆస్తిని దానం చేస్తేనే అది వక్ఫ్ కిందకు వస్తుంది. తాజాగా కొత్త బిల్లులో కేంద్రం ఈ పాయింట్ ను చేర్చింది.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ చట్టంలో మార్పులపై ముస్లిం పెద్దలు తీవ్రంగా స్పందించారు. ఇది వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని హరించడమే అవుతుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు అధికారాలను కట్టడి చేయడం సరికాదని మండిపడ్డారు. ముస్లిం పెద్దల వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోంది. గతంలో ఉన్న చట్టం ప్రకారం కోర్టులు కూడా అందులో జోక్యం చేసుకోలేవు. ఇలాంటి చట్టం సౌదీ అరేబియా, ఒమన్ లాంటి దేశాల్లో కూడా అమల్లో లేదని బీజేపీ వర్గాలు చెప్తున్న మాట. అందుకే వాటిల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడుతున్నారు. పాత చట్టం ప్రకారం ఏదైనా స్థలం వక్ఫ్ పరిధిలోకి వెళ్తే ఇక దానిపై పోరాడే అవకాశం లేనట్లే. ఈ బిల్లును ముస్లింలలోని కొద్ది మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని బీజేపీ అంటోంది. మెజారిటీ వర్గాలు మాత్రం చట్టంలో మార్పులు అవసరమని చెప్తున్నట్టు బీజేపీ వాదన.

తాజా మార్పులతో ఈ బోర్డుల్లో ఇద్దరు మహిళలు సభ్యులుగా చేరే అవకాశం ఉంటుంది. అయితే లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ప్రస్తుతం వివాదం నెలకొంది. అయినప్పటికీ దీనిపై ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక లోక్ సభలో కూడా మెజార్టీ సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు.

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రివ్యూ చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీలో మొత్తం 21 మంది సభ్యులుంటారని తెలిపారు. అధికార పక్షంలోని నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులనూ ఇందులో సభ్యులుగా చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ 21 మంది సభ్యుల్లో తెలంగాణ నుంచి ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణకు, ఏపీ టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలుకి చోటు దక్కింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదనను సభ్యులు సైతం ఆమోదించారు. ఇక ఈ కమిటీ తెచ్చే రిపోర్ట్ మీదే వక్ఫ్ చట్టంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతా అనుకున్నట్టే జరుగుతుందని బీజేపీ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news