బిగ్ షాక్: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎంపీ?

-

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది. వరుసపెట్టి వలసలని ప్రోత్సహిస్తూ..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి షాక్ ఇచ్చే దిశగా వెళుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగిన విషయం తెలిసిందే. పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇదే సమయంలో బి‌ఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీ సైతం కాంగ్రెస్ లోకి రావడానికి మంతనాలు సాగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో అధికార బి‌ఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ మరో పెద్ద షాక్ ఇవ్వనుందా? అనే కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు బి‌ఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డి..ఇంకా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఇదే క్రమంలో నాగర్‌కర్నూలు ఎంపీ పి.రాములు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే రాములు..కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. అటు వ్యూహకర్త సునీల్ కానుగోలు టీం..రాములుతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఈయన కాంగ్రెస్ లోకి వస్తే అచ్చంపేట అసెంబ్లీ సీటు అడుగుతున్నట్లు తెలిసింది. ఆ సీటు ఇస్తే  రాములు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగానే ఉన్నారట.

అయితే రాములు టి‌డి‌పిలో చాలా ఏళ్ళు పనిచేశారు. 1994, 1999, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి అచ్చంపేట బరిలో గెలిచారు. 2014లో టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో బి‌ఆర్‌ఎస్ లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ తరుపున..నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఎంపీగా ఉన్నా సరే..పార్లమెంట్ పరిధిలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదట. ఇటు అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు వర్గాలకు పడటం లేదు.

ఇక రాములు తనయుడు భరత్‌కు జెడ్పీ ఛైర్మన్ పదవి రాకుండా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా పార్టీలో ప్రాధాన్యత లేని నేపథ్యం, పైగా బి‌ఆర్‌ఎస్ లో అసెంబ్లీ సీటు రాదనే ప్రచారం నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌తో టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం. కానీ ఆయన అచ్చంపేట సీటు ఆశిస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు. గత మూడు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయనని కాదని రాములుని తీసుకొచ్చి సీటు ఇస్తారనేది డౌటే. చూడాలి అసలు రాములు కాంగ్రెస్ లోకి వస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news