పాల‌కుల పాపాల‌కు రాజ‌ధాని బ‌లైందా..!

-

ఏపీ రాజ‌ధాని విష‌యం మ‌రోసారి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ప‌దేళ్ల‌లో ఏపీలో రాజ‌ధానిని ఏర్పాటు చేసుకునేందుకు అవ‌కాశం ఇస్తూ.. అప్ప‌టి రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. అప్ప‌టి వ‌రకు ప‌దేళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద రా బాద్‌ను కొన‌సాగేలా నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర భుత్వం అనూహ్యంగా రాజ‌ధానిపై ముందుకు క‌దిలింది. దీనిని అంద‌రూ స్వాగ‌తించారు. అయితే, ఈ విష‌యంలో చంద్ర‌బాబు చూపిన అత్యుత్సాహం.. ఇప్పుడు శాపంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నా యి.

కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధాని కోసం, ఎక్క‌డ ఏర్పాటు చేస్తే.. భౌగోళికంగా, ఆర్థికంగా బాగుంటుంద‌నే వి ష‌యాన్ని ప‌రిశీలించేందుకు శివ‌రామ‌కృష్ణ క‌మిటీని వేసింది. ఈ క‌మిటీ మొత్తం 13 జిల్లాల్లోని 10 జిల్లాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంది. ఇది పూర్తికాగానే ప్ర‌భుత్వానికి నివేదిక అంద‌జేసింది. అయితే, దీనిలో ఏ విష‌యాన్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్ప‌టి మంత్రి నారాయ‌ణ‌తో మ‌రో క‌మిటీని వేసి, రాజ‌ధానిపై అధ్య‌య‌నం చేయించింది. ఇక్క‌డ అనేక లోపాలు జ‌రిగాయ‌ని, త‌న‌కు న‌మ్మిన బంట్లుగా ఉన్న‌వారికి ల‌బ్ధి చేకూర్చేలా చంద్ర‌బాబు చ‌క్రం తిప్పార‌ని ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

గ‌ణాంకాల‌తో పాటు ఎక్క‌డెక్క‌డ ఎలాంటి లోపాలు జ‌రిగాయి. ఔట‌ర్ రింగు రోడ్డును ఎన్ని సార్లు ఎక్క‌డెక్క డ, ఎందుకు మార్పులు చేశారు? అనే అంశాల‌ను ప్ర‌భుత్వం అసెంబ్లీలో ఏక‌రువు పెట్టింది. దీంతో రాజ ధాని అమ‌రావ‌తి వెనుక చంద్ర‌బాబు వ్యూహంలోని సొంత మేళ్లు బ‌య‌ట‌కు పొక్కాయి. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా చంద్ర‌బాబు త‌న త‌ప్పు లేద‌ని చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. స‌రే.. చంద్ర‌బాబు పాల‌నా కాలంలో జ‌రిగిన త‌ప్పులు వెల్ల‌డించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం దీనికి కాయ‌క‌ల్ప చికిత్స చేసి, రాజ‌ధానిపై క్లారిటీ ఇస్తుంద‌ని అంద‌రూ భావించారు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న తెర‌మీదికి తెచ్చింది.

ఈ ప్ర‌తిపాద‌న మ‌రింతగా చ‌ర్చకు దారితీస్తోంది. అస‌లు ఒక రాజ‌ధాని నిర్మించుకునేందుకే ప‌రిస్తితి అం తంత మాత్రంగా ఉంటే.. ఇప్పుడు మూడు రాజ‌ధానులా? అన్న ప్ర‌శ్న‌తోపాటు.. హైకోర్టు ను క‌ర్నూలుకు త‌ర‌లించే ప్ర‌తిపాద‌నను తీవ్రంగా వ్య‌తిరేకిస్తుండ‌డం వంటివి తెర‌మీదికి వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు మార్చ‌డంపైనా కూడా ప్ర‌జ‌ల్లోనే వ్య‌తిరేక‌త వ‌స్తోంది. అంత‌దూరం వెళ్లి ప‌నులు చేయించుకునేందుకు అయ్యే ప‌నేనా?  అనే ప్ర‌శ్న కూడా వ‌స్తోంది. అయితే, అదేస‌మ‌యంలో త‌ప్పులు జ‌రిగాయ‌ని పేర్కొంటున్న అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌ని కూడా ఎవ‌రూ కోరుకోవ‌డం లేదు. మొత్తంగా చూస్తే.. పాల‌కుల చేత‌ల్లో.. రాజ‌ధాని ఓ పావుగా మారింద‌నే విమ‌ర్శ‌లు మాత్రం అన్ని వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news