పాలనా సంస్కరణల్లో టెక్నాలజీకి పెద్దపీట

-

రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీలను వాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందువరుసలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచంలోని 45 ప్రముఖ వైద్య, సాంకేతిక మరియు టెక్నాలజీ కంపెనీల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ “సేవింగ్ లైఫ్స్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్” అనే అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఎమర్జింగ్ టెక్నాలజీలతో వైద్య సేవల విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవల పరిధిని విస్తరించే అవకాశాలను తెలంగాణ ఉపయోగించుకోబోతుందని అన్నారు. కరోనా లాంటి మహమ్మారి పైన సాగించే పోరులో సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీలను వాడుకోవడంలో తమ ప్రభుత్వం ముందువరుసలో ఉందని, ముఖ్యంగా భూసంస్కరణలు మరియు ఇతర పాలనా సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద పీట వేసి ముందుకు పోతున్నామన్నారు. సమాజ క్షేమానికి దోహదపడని సాంకేతిక పరిజ్ఞానం వృథా అని తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచనా విధానం మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పౌర సేవలు మరియు సమాజ హితానికి ఎలా వాడుకోవాలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ముందుకు పోతున్నామని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభానికి సంబంధించిన ఆపత్కాలంలో టెక్నాలజీని ఉపయోగించుకొని కరోనా కట్టడి మరియు వైద్య విద్య సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందన్నారు. అయితే ఈ రంగాల్లో టెక్నాలజీల వినియోగం ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉందని భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక రెట్లు ప్రజలకు ప్రయోజనాలు కల్పించే వీలు కలుగుతుందన్నారు. ఇప్పటికే వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డ్రొన్ల సాంకేతికత వినియోగానికి సంబంధించిన ఒక పైలట్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా లాంటి మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రపంచంలోని ప్రతి మానవుని యొక్క హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news