రాజస్తాన్ సీఎం గా యూపీ తరహాలో మరో ‘యోగి’ ని తెస్తున్న బీజేపీ

-

రాజస్తాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.అసెంబ్లీలో మొత్తం 199 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ రాజకీయ పార్టీకైనా 101 సీట్లు కావాలి. అయితే తాజా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 115 మెజారిటీ స్థానాలను దక్కించుకుంది.నిన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 69 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం ఎవరు అనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలో రెండు సార్లు సీఎంగా పనిచేసిన వసుంధర రాజే, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రాజ్ సమండ్ నియోజకవర్గ నుంచి గెలిచిన దియా కుమారి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అయితే బీజేపీ అధిష్టనం రాజస్థాన్ సీఎం నియామకంపై ఓ ప్రయోగం చేయబోతోందని సమాచారం. ఉత్తర ప్రదేశ్ తరహాలో ఇక్కడ కూడా ఆదిత్యనాథ్‌ తరహాలో మరో యోగి ని తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఊహించని విధంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి రేసులోకి ఓ సన్యాసిని తీసుకొస్తున్నారు. ఆయన మరెవరో కాదు తిజార నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మహంత్ బాలక్ నాథ్ యోగి. ఆయనకు ఆర్ఎస్ఎస్, బీజేపీ అధిష్ఠానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయి.

40 ఏళ్ల మహంత్ బాలక్ నాథ్ రాజస్తాన్ లోని అల్వార్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తిజార సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన రాజస్తాన్ సీఎం పదవికి పోటీ పడుతున్నట్లు మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. పార్టీ హై కమాండ్ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.అందుకే ఆయన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించారని అంటున్నారు. ఆయన చిన్న వయస్సులోనే సన్యాసం స్వీకరించారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆరేళ్ల ప్రాయంలోనే ఆయన సన్యాస దీక్ష తీసుకున్నారు. పూర్తిగా సమాజానికి సేవ చేయడానికి తాను ఆ మార్గం స్వీకరించానని బాలక్ నాథ్ అనేకసార్లు చెప్పారు.అల్వార్ ప్రాంతంలో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు ఉన్నారు.

ఉత్తర ప్రదేశ్ సీఎం, గోరఖ్ పూర్ మఠాధిపతి యోగి ఆదిత్యానాథ్ తరహాలో మహంత్ బాలక్ నాథ్ కూడా నాథ్ సామాజిక వర్గానికి చెందినవారే.అల్వార్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా బాలక్ నాథ్‌ నిలిచారు. బాలక్ నాథ్ రాజకీయ ప్రస్థానం అతని గురువు, అల్వార్ మాజీ పార్లమెంటు సభ్యుడు మహంత్ చంద్‌నాథ్ తో మొదలైంది. హర్యానాలోని బాబా మస్త్‌నాథ్ మఠానికి బాలక్ నాథ్ అధిపతిగా కొనసాగుతున్నారు.యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ మద్దతు కూడా ఆయనకు ఉంది.
రాజస్థాన్‌లోని అల్వార్ నుండి లోక్‌సభ స్థానం నుంచి 2019 ఎన్నికలలో కాంగ్రెస్‌కు చెందిన భన్వర్ జితేంద్ర సింగ్‌ను 3 లక్షల ఓట్ల తేడాతో ఓడించి గెలుపొందాడు.

2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఆయన తిజారా శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందాడు.
అయితే, ప్రస్తుతం బీజేపీ తరఫున రాజస్తాన్ సీఎం రేసులో మాజీ సీఎం వసుంధర రాజె సింథియా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఉండడం గమనార్హం. సీఎం పదవి రేసులో ఉండడంపై మహంత్ బాలక్ నాథ్ స్పందించారు. సీఎం పదవి ముఖ్యం కాదని, ప్రధాని మోదీ నాయకత్వంలో సమర్థవంతంగా పని చేస్తామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీనే నిర్ణయిస్తుందన్నారు. మరి బీజేపి అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news