టీఆర్ఎస్‌లో ‘ఆపరేషన్ రెబల్స్’ మొదలుపెట్టిన కేటీఆర్..

-

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. కేటీఆర్ ఆపరేషన్ రెబల్స్ మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల ఘటంలో నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో… టీఆర్ఎస్ రెబల్స్‌గా బరిలోకి దిగిన వారిని బుజ్జగించి పోటీ నుంచి తప్పుకునేలా చేయడంపై కేటీఆర్ ఫోకస్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీలో నిలిచిన రెబల్స్‌ జాబితాతో వెంటనే తనను కలవాలని ఎమ్మెల్యేలు, మంత్రులను కేటీఆర్ ఆదేశించారు. దీంతో జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలంతా..రెబల్స్ జాబితాతో కేటీఆర్‌ను కలుస్తున్నారు. అయితే మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక‌ పీర్జాదిగూడకు చెందిన తమ పార్టీ నేత దర్గా దయాకర్‌రెడ్డి తీరుపై ఆయన పార్టీ నేతలతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దర్గా దయాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలతో డబుల్‌ గేమ్‌ ఆడుతూ, గంటల వ్యవధిలోనే రెండు పార్టీల నుంచీ ఆయన నామినేషన్‌ వేశారు. ఈ విషయంపై మంత్రి మల్లారెడ్డితో కేటీఆర్‌ మాట్లాడనున్నారు. రెబల్స్ లిస్టుతో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో ఆయన విడివిడిగా భేటీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news