ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాకం.. క‌రోనా ఉంద‌ని 35 మందికి త‌ప్పుడు రిపోర్టు..

-

మ‌న దేశంలో ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్లు, వాటిల్లో ఉండే ల్యాబ్‌లే నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరిస్తున్నాయ‌నుకుంటే పొర‌పాటు. ఎందుకంటే నోయిడాలో ఓ ప్రైవేటు ల్యాబ్ కూడా పేషెంట్ల విష‌యంలో తీవ్ర నిర్ల‌క్ష్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శించింది. క‌రోనా లేకున్నా.. ఉంద‌ని చెప్పి త‌ప్పుడు రిపోర్టులు ఇచ్చింది. దీంతో వారు క‌రోనా ఉంద‌ని అనుకుంటూ చికిత్స కోసం ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో ఆ ల్యాబ్ నిర్వాకం బ‌య‌ట‌పడింది.

private lab in noida given false report to 35 patients said they got corona

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో ఉన్న‌ గౌతం బుద్ధ న‌గ‌ర్‌కు చెందిన 35 మంది పేషెంట్లు జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు వంటి ల‌క్ష‌ణాల‌తో ఓ ప్రైవేటు ల్యాబ్‌లో టెస్టులు చేయించుకున్నారు. అయితే ఆ ల్యాబ్ నిర్వాహ‌కులు వారి నుంచి పెద్ద మొత్తంలో క‌రోనా టెస్టుల‌కు ఫీజుల‌ను అయితే వ‌సూలు చేశారు కానీ.. ప‌రీక్ష‌లు స‌రిగ్గా చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. వారికి క‌రోనా ఉంద‌ని రిపోర్టు ఇచ్చారు. దీంతో ఆ పేషెంట్లు స‌మీపంలోని ప్ర‌భుత్వ కోవిడ్ 19 చికిత్సా కేంద్రానికి వెళ్లారు. అయితే అక్క‌డికి వెళ్లాక వైద్యుల‌కు అనుమానం వ‌చ్చింది. దీంతో వారు మ‌ళ్లీ ఆ పేషెంట్ల‌కు క‌రోనా టెస్టులు చేశారు. వారి శాంపిల్స్‌ను సేక‌రించి ప‌రీక్ష‌లు చేయ‌గా.. వారికి కరోనా లేద‌ని తేలింది.

అయితే అప్ప‌టికే ఆ కోవిడ్ 19 చికిత్సా కేంద్రంలో ఆ 35 మంది 3 రోజుల నుంచి ఉండ‌డంతో వారిని క్వారంటైన్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. వారికి క‌రోనా వార్డులో ఉండ‌డం వ‌ల్ల ఆ వైర‌స్ వ్యాపించి ఉండ‌వ‌చ్చున‌నే అనుమానంతో వైద్యులు వారిని క్వారంటైన్ చేశారు. కాగా ఆ పేషెంట్ల‌కు క‌రోనా ఉంద‌ని చెప్పి త‌ప్పుడు రిపోర్టు ఇచ్చిన స‌ద‌రు ప్రైవేటు ల్యాబ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news