ఆర్సీబీ ఉమెన్స్ జట్టు మెంటర్ గా సానియా మీర్జా

-

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళా క్రికెటర్లకు మార్గనిర్దేశం చేయబోతున్నారు. మార్చిలో జరిగే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు మెంటార్ గా ఆమె వ్యవహరించనుంది. ఈ టెన్నిస్ దిగ్గజం తమ టీమ్ కు మెంటార్ గా నియమించినట్టు ప్రకటించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కొత్త సంప్రదాయానికి తెరలేపింది. ఇప్పటిదాకా అన్ని జట్లకు క్రికెటర్లే మెంటార్లుగా ఉన్నారు. టెన్నిస్ లో ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన మీర్జా, జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆడింది. రోహన్ బోపన్నతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ నెలలో దుబాయ్ లో జరిగే డబ్ల్యూటీఏ టోర్నీతో ఆమె ఆటకు వీడ్కోలు తెలుపనుంది.

టెన్నిస్ లో ఎన్నో శిఖరాలు అధిరోహించిన సానియాను గౌరవిస్తూ, ఆర్సీబీ ఆమెను మెంటార్ గా నియమించినట్టు తెలుస్తోంది. మెంటార్‌గా తన కొత్త పాత్రపై సానియా స్పందించారు.విమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో భారత మహిళల క్రికెట్ ఎంతో మార్పును చూడబోతోంది. ‘ఆర్సీబీ మహిళల జట్టులో మెంటార్‌గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో భాగం కావాలని నేను ఎదురు చూస్తున్నా. ఆర్‌సీబీ చాలా సంవత్సరాలుగా ఐపీఎల్‌లో జనాదరణ పొందుతున్న జట్టు. చాలా మంది ఇష్టపడే జట్టు. ఇప్పుడు ఆర్సీబీ యాజమాన్యం మహిళల ప్రీమియర్ లీగ్ కోసం ఒక జట్టును నిర్మించడాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది దేశంలో మహిళల క్రీడలను కొత్త ఎత్తులకు తీసుకువెళుతుంది. కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఆడపిల్లలు, యువతులు క్రీడలను కెరీర్ గా ఎంచుకునేలా చేస్తుంది’ అని ఆర్సీబీ విడుదల చేసిన వీడియోలో సానియా వెల్లడించారు.

డబ్ల్యూపీఎల్ మార్చి 4న మొదలవనుంది. ఇటీవల జరిగిన క్రికెటర్ల వేలంలో ఆర్సీబీ స్మృతి మంధాన సహా పలువురు స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ, ఇంగ్లండ్ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హీథర్ నైట్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ తదితరులు ఉన్నారు. మంధాన రూ. 3.4 కోట్లతో వేలంలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news