కోల్‌బెల్ట్‌లో సెగలు పుట్టిస్తున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు !

-

ఎండాకాలానికి తోడు సింగరేణి బెల్ట్‌లో ప్రస్తుతం ఎన్నికల వేడి కూడా సెగలు రేపుతోంది. కార్మికుల సమస్యలు.. వారసులకు ఉద్యోగాలు ఇలా చాలా అంశాలు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. సింగరేణిని ప్రైవేటీకరిస్తారన్న ప్రచారం పీక్‌లో ఉంది. గతంలో ఒక లక్షా 40 వేల మంది కార్మికులు పనిచేసిన చోట.. ఇప్పుడు 40 వేల మందే పనిచేస్తున్నారు. వీటిన్నింటిపైనా కార్మిక సంఘాల మధ్య ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో ఈ సారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో సింగరేణి విస్తరించింది. మొత్తం 11 యూనిట్లు. ఒకప్పుడు ఈ 11 యూనిట్లలో ఎర్రజెండాలు ఎగిరేవి. లెఫ్ట్‌ అనుబంధ సంస్థల్లోనే కార్మికులు సభ్యులుగా ఉండేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గడిచిన రెండు పర్యాయాలుగా టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘానిదే రాజ్యం. సీపీఐ అనుబంధ ఏఐటియూసీకి ఎదురుగాలి వీస్తోంది. ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకోవడంతో మళ్లీ పాగా వేయడానికి సరికొత్త పాచికలను సిద్ధం చేస్తోంది సీపీఐ.

సింగరేణి కార్మికుల్లో పట్టు సాధిస్తే..ఆ ప్రభావం సాధారణ ఎన్నికల్లోనూ కనిపిస్తుందన్నది పార్టీల అభిప్రాయం. గతంలో 11 డివిజన్లలో 9 చోట్ల టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం విజయం సాధించింది. ఆ సంఘానికి ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలు. ఏఐటీయూసి కేవలం రెండుచోట్లే సత్తా చాటిన పరిస్థితి. ఈ దఫా సింగరేణిలో పూర్వ వైభవం సాధించేందుకు.. నల్లబంగారు గనుల్లో ఏఐటీయుసి ని బలోపేతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు బాధ్యతలు అప్పగించింది సీపీఐ. ఆ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఆయన పని కూడా మొదలు పెట్టేశారు.

కమ్యూనిస్ట్‌లకు కార్మికులే అండ. కొన్నాళ్లుగా ఆ వర్గానికి దూరం అవుతున్నామన్న ఫీలింగో ఏమో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని చూస్తున్నారు కామ్రేడ్లు. ఇందుకోసం సింగరేణి నుంచి ఆపరేషన్‌ మొదలుపెట్టారు. నల్లబంగారంలో ఎర్ర పాచికలు వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన టీఆర్ఎస్,సీపీఐలకు సింగరేణిలో కుస్తీపట్లు తప్పడం లేదు. సాధారణ ఎన్నికల్లో కుదురుతున్న దోస్తీ ఇక్కడ మాత్రం సాధ్యం కావడం లేదు. ఈ దఫా మాత్రం కార్మిక లోకంలో మళ్లీ పట్టు సాధించకపోతే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనలో కామ్రేడ్లు ఉన్నారట. అందుకే టీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని బలంగా ఢీకొట్టేలా వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం.

ఓ వైపు బీజేపీ అనుబంధ సంఘం సైతం ఈ సారి ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు.. గుణపాఠాలను రిపీట్‌ చేయకూడదనే ఆలోచనలో ఉన్నాయట బరిలో ఉన్న కార్మిక సంఘాలు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ అనుబంధం సంఘం కూడా ప్రచారాన్ని ఉధృతం చేసింది. దీంతో కోల్‌బెల్ట్‌ పాలిటిక్స్‌ జనరల్‌ ఎలక్షన్స్‌ను మించి సాగుతున్నాయని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news