సీజేఐ జస్టిస్ యుయు లలిత్ కు ఘనంగా వీడ్కోలు

-

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు తోటి జడ్జీలు, న్యాయవాదులు. జస్టిస్‌ యూయూ లలిత్‌ మంగళవారం పదవీ విరమణ చేయాల్సి ఉన్నా.. గురునానక్‌ జయంతి సందర్భంగా కోర్టుకు సెలవు కావడం వల్ల ఇవాళే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ యూయూ లలిత్‌.. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగారు.

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించనున్నారు. 2024 నవంబర్‌ 10 వరకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.

ట్రిపుల్‌ తలాక్‌ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2017లో 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ సభ్యుడు. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం రూలింగ్‌ ఇచ్చింది. ఆయన సీజేఐ అయితే బార్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తి అయ్యారు. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన మొదటి న్యాయవాది. 1964లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news