లైంగిక దాడుల నుంచి కబ్జా వివాదాల్లోకి నిత్యానంద

-

నిత్యానంద కబ్జా వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే ఆధ్యాత్మికత ముసుగులో లైంగిక దాడులకు దిగాడనే ఆరోపణలున్న నిత్యానంద దేశం నుంచి పారిపోయాడు. ఇప్పుడు కొత్తగా నిత్యానంద అతని అనుచరులపై కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంచీపురంలోని తొండైమండల అధీనం కబ్జాకు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. రెండేళ్లుగా మఠంలో తిష్ట వేసిన నిత్యానంద శిష్యగణం అధీనం పీఠాధిపతిగా నిత్యానంద అనుచరుడికి పట్టం కట్టేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా సమాచారం. అయితే, అధీనం పీఠాధిపతి జ్ఞాన ప్రకాశ దేశిగం అనుమానాస్పదంగా మృతి చెందారు.

నిత్యానంద అనుచరుల ప్రయత్నాలను వ్యతిరేకించిన అధీనం ప్రతినిధులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. అధీనం పీఠాధిపతి జ్ఞాన ప్రకాశ దేశిగం మృతి పట్ల కూడా శిష్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధీనానికి కూడా వేల కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ ఆస్తుల మీద కన్నేసిన నిత్యానంద వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఇలా తన వర్గాన్ని చొప్పించారని అంటున్నారు.

మరోపక్క కైలాస పేరుతో ఏకంగా దేశాన్నే ఏర్పాటు చేసేసినట్టు ప్రకటించిన నిత్యానంద తనదేశానికి రిజర్వ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తాను ఒప్పందం చేసుకున్న దేశాలతో తన కరెన్సీ చెల్లుబాటు అవుతుంవదని చెప్తున్నారు. తనపై ఇండియాలో కుట్రపూరిత దాడి జరుగుతోందని, అందుకే అక్కడి నుంచి వచ్చేసినట్లు చెప్పుకొచ్చారు.

కర్ణాటక, గుజరాత్‌ లోలో ఆశ్రమాలు స్థాపించి ఆధ్మాత్మిక ముసుగులో మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నిత్యానంద దేశాన్ని విడిచి పారిపోయాడు. అనేక ఆరోపణల మీద 50 సార్లు కోర్టుకు హాజరైన నిత్యానంద.. ఈక్వెడార్కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. నిత్యానంద ఆచూకీ కోసం ఇంటర్పోల్ ఫిబ్రవరిలో బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news