హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నగర పోలీసులు కొత్త అడుగు వేశారు. సాధారణంగా ప్రధాన జంక్షన్ల వద్ద కనిష్టం ఇద్దరు, గరిష్టం ముగ్గురు పోలీసులు విధుల్లో ఉంటారు. కానీ రెండు జంక్షన్ల మధ్యలో సమస్యలు తలెత్తినప్పుడు స్పందన ఆలస్యమవుతుంది. ఈ లోటు తీర్చేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో తొలి దశలో 50 అధ్యాధునిక అవెంజర్ వాహనాలను కొనుగోలు చేసి వాటిని టాస్క్ ఫోర్స్ కు అందజేశారు. వీటిని గురువారం నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆవిష్కరించారు.

బజాక్ కంపెనీకి చెందిన తెలుపు రంగు అవెంజర్ 220 క్రూయిజ్ బైక్ లు ఈ టాస్క్ ఫోర్క్ కోసం ఎంపికయ్యాయి. ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా సంచరించినా డ్రైవర్ అలిసిపోకుండా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీటిపై HCSC, సిటీ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ లోగోలు ముద్రించారు. భవిష్యత్తులో మరో 100 వాహనాలను కొనుగోలు చేయనున్నారు. ఈ టాస్క్ ఫోర్క్ ప్రధానంగా జంక్షన్ల మధ్య ట్రాఫిక్ జామ్ లను నివారించడం, అక్రమ పార్కింగ్ తొలగించడం, రోడ్లపై ఉన్న అడ్డంకులను క్లియర్ చేయడం, ప్రమాదాల సమయంలో వెంటనే స్పందించడం, అలాగే బ్రేక్ డౌన్ వాహనాలను గుర్తించి తొలగించడం వంటి పనులు చేస్తుంది.