వర్షాల వల్ల సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

-

గత మూడ్రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రెండ్రోజులుగా ఎడతెరిపి లేని వాన పడుతోంది. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణిలోని పలు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కోయగూడెం గనులలో మొత్తం 20వేల టన్నుల బొగ్గు, 50వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీత నిలిచిపోయిందని వెల్లడించారు.

మరోవైపు భూపాలపల్లి సింగరేణి ఆధ్వర్యంలోని KTK ఉపరితల గని 2, 3 లలో మొత్తంగా 7వేల 25టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దాదాపు 1.72కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. గనిలో దారులన్నీ బురదమయం అవటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గనిలో నిలిచిన నీటిని భారీ పంపుల ద్వారా బయటకు పంపేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు కోయగూడెం గనిలో వర్షం తగ్గుముఖం పడితేనే మళ్లీ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news