విద్యుత్తు బిల్లుల చెల్లింపుల విషయంలో తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్లోని ఏపీసీపీడీసీఎల్లు యూటర్న్ తీసుకున్నాయి. ఇటీవల సదరు విద్యుత్ యాప్ లలోనే బిల్లులు పే చేయాలని చెప్పిన ఈ సంస్థలు తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. గతంలో మాదిరి మొబైల్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్తు బిల్లుల చెల్లింపులను సరళీకృతం చేసేందుకు ఈ సంస్థలు భారత్ బిల్ పేమెంట్ సిస్టం(బీబీపీఎస్)లో చేరాయి. డిస్కంలు బీబీపీఎస్లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్టెక్ యాప్లు, వెబ్సైట్లతో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారానూ బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని బీబీఎల్ వెల్లడించింది. బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారానే కరెంట్ బిల్లుల చెల్లింపులు జరగాలని నిర్దేశిస్తూ.. రిజర్వ్ బ్యాంక్ జులై 1 నుంచి యూపీఐ ద్వారా నేరుగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విద్యుత్ సంస్థలు బీబీపీఎస్లోకి చేరుతుండటంతో యూపీఐ చెల్లింపులకు మార్గం సుగమం అవుతోంది. ఈ నిర్ణయం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.