రామ్ నాథ్ కోవింద్ కమిటీని బహిష్కరిస్తాము : సీపీఐ నారాయణ

-

అఖిల పక్షంతో జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం చర్చించలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.  రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీని బహిష్కరించే యోచనలో తమ పార్టీ ఉందన్నారు. ఈ కమిటీని బోగస్ కమిటీగా ఆయన పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై  రాజకీయ  పార్టీలతో కేంద్రం చర్చించదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇండియా కూటమి దెబ్బకు  బీజేపీ నాయకత్వం జమిలి అనే చర్చను తెరమీదికి తీసుకు వచ్చిందని  నారాయణ అభిప్రాయపడ్డారు. 

ఈ ఏడాది చివరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు  మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలను  ఒకేసారి నిర్వహించాలని కేంద్రం చూస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా  బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని  నారాయణ  చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారనే భయంతో కేసీఆర్ బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని సీపీఐ  నారాయణ ఆరోపించారు. తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీతో  సీపీఐ, సీపీఎంలు  చర్చిస్తున్నాయని సీపీఐ  నారాయణ  చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో చర్చలు సఫలమైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి  రెండు కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేస్తాయన్నారు. లేకపోతే  తమ పార్టీ 20 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్టుగా నారాయణ  చెప్పారు. మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తుందన్నారు.  అయితే ఈ విషయమై  త్వరలోనే  మరింత స్పష్టత రానుందని  నారాయణ  తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news