మరోసారి రాజీనామా ప్రస్తావన తీసుకొచ్చిన హరీశ్ రావు.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్..!

-

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. మంగళవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15వ తేదీలోపు ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో పంపుతా అని ఛాలెంజ్ చేశారు. సీఎం కూడా తన రాజీనామా లేఖను పంపాలని అన్నారు. అమలు చేస్తే నా రాజీనామాను ఆమోదించాలని.. చేయలేకపోతే సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డి స్వచ్ఛంగా తప్పుకోవాలి అని డిమాండ్ చేశారు. సన్న వడ్లకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500 బోనస్ ప్రకటించడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ అని.. సర్కారు మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, తాము ఆ మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో పచ్చి అబద్ధాలాడి రైతులను మోసం చేసిందని విమర్శించారు. రూ.500 బోనస్.. ఆరు గ్యారంటీల్లో ఉందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చడం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తుండగా.. వారందరి ఆశలు అడియాసలు చేసిందని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version