భార్య కోసం ఈతరాకపోయినా బావిలో దూకిన భర్త.. కాపాడేందుకు స్నేహితుడు…

-

హాయిగా.. జాలీగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ చిన్న కలత కలకలం సృష్టించింది. చిన్న గొడవతో భార్య తాను ఏ బావిలోనైనా దూకి చస్తానని భర్తను బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెంటే వెళ్లిన భర్తకు భార్య కనిపించకపోవడంతో బావిలో దూకిందని భావించి ఆమెను కాపాడేందుకు ఈత రాకపోయినా అతను బావిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

అప్పలనరసింహాపురంలో నాగరాజు-రమణ దంపతులు ఆదివారం రాత్రి ఘర్షణ పడ్డారు. మనస్తాపానికి గురైన భార్య రమణ… తాను ఏ బావిలోనైనా దూకి చస్తానంటూ భర్తను బెదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో ఆమె సమీప వ్యవసాయ బావిలో దూకిందేమోనని భావించిన భర్త నాగరాజు… ఈత రాకపోయినా బావిలో దూకాడు. అది గమనించిన అతని స్నేహితుడు జోజి… నాగరాజును రక్షించేందుకు బావిలోకి దిగిన క్రమంలో ఇద్దరూ గల్లంతై మృతి చెందారు.

మృతుడి భార్య రమణ మాత్రం సమీప చేనులో రోదిస్తూ సురక్షితంగా ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. కేవలం ఆమె భర్తను బెదిరించేందుకే ఇంటి నుంచి వెళ్లిపోయిందని గ్రామస్థులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news