తెలంగాణలో 87 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధం.. త్వరలోనే ప్రకటన: కాసాని జ్ఞానేశ్వర్‌

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుంద‌ని… ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని తెలిపారు. తెలంగాణలో కొంత మంది, కొన్ని మీడియా సంస్థలు టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని.. తెలంగాణలో టీడీపీ ఖతం అంటూ పిచ్చికూతలు కూస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే టీడీపీనే బలంగా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేనతో ముందుకెళ్లాలా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ నేత బాలకృష్ణ ప్రచారం చేస్తారని వివరించారు. అభ్యర్థుల జాబితాతో పాటు టీడీపీ మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తామని కాసాని తెలిపారు.  ఇప్పటికే 87 మంది జాబితా తమ వద్ద ఉందని చంద్రబాబు ఆమోదం తెలపగానే విడుదల చేస్తామని వెల్లడించారు. మిగతా పార్టీల నుంచి చాలా మంది నాయకులు టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు.

‘ములాఖత్‌లో చంద్రబాబును కలిసి మాట్లాడా. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చంద్రబాబుకు వివరించాను. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై దేశమంతా ఆందోళన ఉంది. ఆయన ఆరోగ్యం గురించి కూడా ఆరా తీశాను. రేపు చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నాం.’ అని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news