ఆ విషయంలో జగన్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలి – కోమటిరెడ్డి

-

ఆదివారం భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు టిఆర్టి అభ్యర్థులు. ఏళ్లు గడుస్తున్నా టిఆర్టి చేపట్టడం లేదని ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. టిఆర్టి అభ్యర్థుల తరపున పోరాటం చేస్తానని.. ఇప్పటికే ఈ అంశంపై సీఎం కేసీఆర్ కి లేఖ రాశారని చెప్పారు. టిఆర్టి అభ్యర్థులు ఎన్నో ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ బడుల్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. కానీ ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడం లేదన్నారు. ఈ కారణంగా లక్షల మంది పేద పిల్లలకు సరైన విద్య అందడం లేదన్నారు. కెసిఆర్ ఏది చేసినా ఓట్ల కోసమేనని ఆరోపించారు. టీచర్ ఉద్యోగాల కోసం నాలుగు లక్షల మందికి పైగా కోచింగ్ తీసుకున్నారని తెలిపారు. ఓట్ల కోసం స్కీముల పేరుతో మోసాలు చేస్తున్న కేసీఆర్ కి నిరుద్యోగుల బాధలు పట్టవా..? అని ప్రశ్నించారు. ఆనాడు యువత కొట్లాడితేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని.. ఈ విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు.

ఇందిరాపార్క్ దగ్గర 48 గంటలు దీక్ష చేసి నిరుద్యోగులకు అండగా ఉంటామని తెలిపారు. స్కూల్లలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని.. పిల్లలు తగ్గిపోతున్నారని తెలిపారు. టీచర్లు లేక పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్నారని.. కొందరైతే ఏకంగా చదువుకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. తన తాత చేస్తున్న నిర్లక్ష్య పాలనపై హిమాన్షు చాలా చక్కగా వివరించారని.. ఓ స్కూల్ దుస్థితిపై చెబుతూ బిఆర్ఎస్ పాలన ఎలా ఉందో చెప్పాడని అన్నారు. స్కూల్ల విషయంలో సీఎం జగన్ ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని అన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దిగిరాకపోతే ప్రగతి భవన్ ని ముట్టడిద్దామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news