సీఎం కేసీఆర్ కి కోమటిరెడ్డి బహిరంగ లేఖ

-

సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతు బంధు పూర్తిస్థాయిలో ఎప్పుడిస్తారు..? ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినప్పటికీ డబ్బులు రాక రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి కి లేఖ రాశారు.

” మీ మాటలు కోటలు దాటుతాయి.. పనులు గేటు కూడా దాటవు.. దీనికి నిదర్శనమే రైతు బంధు డబ్బుల జమ. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు పనులు ప్రారంభించారు. కానీ, రైతు బంధు మాత్రం పూర్తి స్థాయిలో అందలేదు. ఇంకా లక్షల మంది అన్నదాతలు ఆ నగదు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. బ్యాంకు అకౌంట్‌ లో డబ్బులు ఎప్పుడు పడతాయి? మెసేజ్‌ వచ్చి సెల్‌ ఫోన్‌ ఎప్పుడు మోగుతుందా అని చూస్తున్నారు రైతులు. వానాకాలం సాగు ప్రారంభం కావడంతో రైతులు ముందుగా వరి నార్లు పోశారు. కానీ, చాలా వరకు పత్తి సాగు వైపు మళ్లారు. వరి విత్తనాల కొనుగోలుకే రైతులు దాచుకున్న డబ్బులు అయిపోయాయి.

పత్తి విత్తనాల కొనుగోలుకు రైతుబంధు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. కానీ, ఇంతవరకు రైతులందరికీ రైతు బంధు నగదు అందలేదు. ఆర్థికశాఖ కొంతవరకే నిధులు విడుదల చేసిందని తెలిసింది. దీనివల్ల కొందరికే జమ అయ్యాయి. మిగిలినవారికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ ఏడాది రైతు బంధు కింద దాదాపు 70 లక్షల మంది అర్హులుగా ఉన్నారు. మొత్తం రూ.7,720.29 కోట్ల నిధులు అవసరమని అంచనా. మరి, అందరికీ ఎప్పుడు జమచేస్తారు.

రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టుకోవడం కాదు.. రైతు బంధు పూర్తిస్థాయిలో ఎప్పుడిస్తారో చెప్పండి. రైతు సంఘాల ద్వారా నాకు మరో విషయం తెలిసింది. రైతు బంధు డబ్బులు బ్యాంకు ఖాతాలలో జమ చేయగా వాటిని తీయడానికి వీలు లేకుండా అకౌంట్‌ లను హోల్డ్‌ లో పెడుతున్నారట. రైతు బంధు పేరుతో ప్రభుత్వం ఒకవైపు డబ్బులు వేస్తూనే.. మరోవైపు బ్యాంకులలో రుణాలు చెల్లించాలనే కారణంతో రైతుల ఖాతాలను హోల్డ్‌ లో ఉంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.

లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయకపోవడంతో బ్యాంకులలో వడ్డీల మీద వడ్డీలు పెరిగి అన్నదాతల అప్పులు రెట్టింపయ్యాయి. మీరు చేసిన మోసంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే హోల్డ్ లో పెట్టిన అకౌంట్స్ ను తిరిగి ప్రారంభించి రైతులకు నగదు అందేలా చేయాలి. అలాగే, మిగిలిన రైతులకు కూడా రైతు బంధు నగదును వెంటనే జమ చేయాలి. లేదంటే, రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. తర్వాతి పరిణామాలకు మీదే బాధ్యత” అని లేఖలో పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news